Etela: ఈ పోలీసులు ఉన్నారే.. టెన్త్ పేపర్ లీక్ కేసును పక్కా పొలిటికల్ కేసుగా మార్చేస్తున్నారు. పేపర్ బయటకు వచ్చిన కొన్నిగంటల్లోనే బండి సంజయ్ను అరెస్ట్ చేసి.. ఆయనే ఏ1 అంటూ కేసు పెట్టి.. జైలుకు పంపించారు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు నోటీసులు ఇచ్చి.. విచారణకు రమ్మని పిలిచారు.
ఇంతకీ ఈటల చేసిన తప్పేంటంటే.. ఆయనకు కూడా వాట్సాప్లో పేపర్ రావడం. ఏ2 ప్రశాంత్ అనేక మందికి టెన్త్ పేపర్ సెండ్ చేశాడని వరంగల్ సీపీ రంగనాథ్ చెప్పారు. వారిలో ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. ఈటల పీఏలకు కూడా పేపర్ పంపించారు. అయినా, ఆయనపై తామేమీ కేసు పెట్టలేదంటూ బుధవారం ప్రెస్మీట్లో క్లారిటీ ఇచ్చారు సీపీ.
కట్ చేస్తే, గురువారం కల్లా సీన్ మారిపోయింది. ఎక్కడినుంచి ఆదేశాలు వచ్చాయో కానీ.. ఈటల రాజేందర్కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. 160 సీఆర్పీసీ విట్నెస్ కింద నోటీసు అందజేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వరంగల్ డీసీపీ ఆఫీసులో హాజరు కావాలని నోటీసులో తెలిపారు.
తానేం తప్పు చేశానని తనకు నోటీసులు ఇచ్చారంటూ ఈటల రాజేందర్ మండిపడుతున్నారు. తనకు వాట్సాప్ అంటే ఏంటో కూడా తెలీదని.. తన ఫోన్లను పీఏలే హ్యాండిల్ చేస్తారని చెప్పారు. తనకెవరో ఏదో పంపించినంత మాత్రాన విచారణకు పిలుస్తారా? అని పోలీసుల తీరును తప్పుబడుతున్నారు రాజేందర్.
పేపర్ లీక్ ఘటనలో ఈటలపై కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం గట్రా చేయకపోయినా.. ఇలా నోటీసులు ఇచ్చి, విచారణకు పిలిచి.. బీజేపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేయడమే బీఆర్ఎస్ ఎత్తుగడ అంటూ మండిపడుతున్నారు కమలనాథులు.