Revanth Reddy: ప్రశ్నిస్తే కేసు పెడతాం. గొంతెత్తితే లోపలేస్తాం.. అన్నట్టు సాగుతోంది కేసీఆర్ పాలన. ధర్నాచౌక్లోనే ధర్నాలు చేయనీయకుండా ఉక్కుపాదం మోపుతున్న సర్కారు ఇది. కోర్టుకు వెళ్లందే.. ఏ నిరసనా చేపట్టలేని రోజులివి. పోరాటాల గడ్డపై ఇదేం జులూం అంటూ ఉద్యమకారులు నిలదీస్తున్నారు. ప్రజాసంఘాలు, నిరుద్యోగులు, రాజకీయ పార్టీలను అడుగడుగునా పోలీసులతో అడ్డుకుంటున్నారు.
ఇక, రేవంత్రెడ్డిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది సర్కారు. ఛాన్స్ చిక్కితే కేసులు పెడుతూ, కోర్టులో దావాలు వేస్తూ కంట్రోల్ చేయాలని చూస్తోంది. ORRపై పోరాడితే.. పరువునష్టం కేసు పెట్టారు. గతంలో కేటీఆర్ ఫామ్హౌజ్ గుట్టు రట్టు చేస్తే.. ఏకంగా జైల్లోకి తోశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈసారి ఏకంగా దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజునే.. రేవంత్ వాక్ స్వాతంత్య్రం చెక్ పెట్టే ప్రయత్నం జరగడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల తీరుపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఇంతకీ అసలేం జరిగిందంటే….
ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలను వేధిస్తున్న పోలీసుల పేర్లు రెడ్ డైరీలో రాస్తున్నామని.. అధికారంలోకి వచ్చాక వారి సంగతి తేలుస్తామంటూ.. ఓ వివాదాస్పద వ్యాఖ్య కూడా చేశారు. ఇదే అదనుగా.. రేవంత్ను కార్నర్ చేశారు.
పోలీసులపై రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నాగర్కర్నూల్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో రేవంత్రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, వంశీచందర్రెడ్డిలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంత అత్సుత్సాహం ఎందుకంటూ పోలీసుల తీరుపై హస్తం నేతలు మండిపడుతున్నారు.