PM Modi Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చే వేళైంది. వచ్చేది అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసమే అయినా.. వాటికంటే పొలిటికల్ యాంగిల్లోనే ఎక్కువ హైప్ వస్తోంది. అసలే బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య హోరాహోరీ నడుస్తోంది. బండి సంజయ్ అరెస్ట్తో అది మరింత పీక్స్కు చేరింది. ఎంపీగా రాహుల్గాంధీపై వేటుతో కాంగ్రెస్ శ్రేణులు బీజేపీపై రగిలిపోతున్నారు. ఇలా విపక్షాలు ఉడికిపోతున్న వేళ.. ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్ ఉత్కంఠ రేపుతోంది.
ప్రధాని పర్యటన రోజునే ఆందోళనలకు పిలుపునిచ్చింది అధికార బీఆర్ఎస్. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ.. బొగ్గు గనుల దగ్గర మహాధర్నాలు చేపట్టనుంది. మరోవైపు, ‘పరివార్ వెల్కమ్స్ యూ మోదీజీ’.. అంటూ బీజేపీలోని కుటుంబ రాజకీయాలపై నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కలకలం రేపింది. అటు, కాంగ్రెస్ సైతం నల్లబెలూన్లతో మోదీకి నిరసన చెబుతామని ఇప్పటికే ప్రకటించింది.
ప్రధాని మోదీ పర్యటన సందర్బంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సికింద్రాబాద్ నుంచి బేగంపేట వరకు ఉన్న ప్రాంతాన్ని ఎస్పీజీ తమ కంట్రోల్లోకి తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు నగరంలో మోడీ పర్యటన కొనసాగనుంది. మోదీ టూర్తో సికింద్రాబాద్, బేగంపేట మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 2 వేల మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోని 8, 9, 10 ప్లాట్ఫారాలపై శనివారం మధ్యాహ్నం వరకు ప్రయాణికులకు అనుమతి లేదు.
రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రధాని మోదీ వెంటే ఉండనున్నారు. సీఎం కేసీఆర్కు ఇన్విటేషన్ ఇచ్చారు. బహిరంగసభలోనూ సీఎం ప్రసంగం కోసం 7 నిమిషాల టైమ్ కేటాయించారు. అయితే, ఎప్పటిలానే ప్రధాని టూర్కు ఈసారి కూడా సీఎం డుమ్మా కొడుతున్నారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు.
శనివారం ఉదయం 11.30 గంటలకు మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 11.45కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వస్తారు. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభిస్తారు. ఆ రైల్లో కొందరు విద్యార్థులు నల్గొండ వరకు ప్రయాణిస్తారు. అంతకుముందే ప్రధాని ఆ విద్యార్థులతో మాట్లాడతారు. 12.15 నిమిషాలకు పరేడ్ గ్రౌండ్కు చేరుకుని.. ఆ వేదికపై నుంచి పలు జాతీయ రహదారుల పనులకు, బీబీనగర్ ఎయిమ్స్ కొత్త భవనాలకు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా పలు రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. 12.50 నుంచి 1.20 వరకు బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు ప్రధాని మోదీ.
మోదీ ప్రసంగం రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను ఈడీ ప్రశ్నించడం.. ఇక్కడ టెన్త్ పేపర్ లీకేజీలో బండి సంజయ్ను అర్థరాత్రి దారుణంగా అరెస్ట్ చేసి జైల్లో వేయడం.. తదితర పరిణామాల దృష్ట్యా మోదీ ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై ఎప్పటిలానే తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారా? కాంగ్రెస్నూ కడిగేస్తారా?