PM Modi Tupran | ప్రజలను పట్టించుకోకుండా.. సెక్రటేరియట్ రాకుండా.. ఎప్పుడూ ఫామ్హౌస్లోనే ఉండే కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా అని ప్రధాన మంత్రి మోదీ ప్రశ్నించారు. ఆదివారం తుప్రాన్లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను శాశ్వతంగా ఫామ్ హౌస్కే పరిమితం చేయాలని చెప్పారు.
కేసీఆర్కు ఎన్నికల భయం పట్టుకుందని.. అందుకే ఓడిపోతానని ముందే ఊహించి ఈ సారి జరిగే ఎన్నికలలో రెండు పోటీ చేస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు. గజ్వేల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్కు భయపడే కామారెడ్డి పారిపోయారని మోదీ అన్నారు. కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అసలు రెండు చోట్ల పోటీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఆలోచించాలని ప్రజలకు సూచించారు.
వారసత్వ రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ వల్లే వ్యవస్థలు నాశనం అవుతున్నాయని మండిపడ్డారు. ఇంతకుముందు ఎన్నికలలో దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ అందరినీ మోసం చేశారు.. దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై హామీలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పాలనలో కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే న్యాయం జరిగిందని సెటైర్ వేశారు. తెలంగాణను కేసీఆర్ తన జాగీరు భావిస్తున్నారని మోదీ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై రైతులతో పాటు ఆ మల్లన్న స్వామి కూడా ఆగ్రహంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా కుమ్మకయ్యాయని ఆ రెండు పార్టీలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఒక కార్బన్ కాపీలా మారిందని అని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అనే రెండు రోగాలకు చికిత్స చేయగలిగే ఏకైక పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తరువాత రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగలేదని.. కానీ తమ పార్టీ మాత్రం సీఎం ఒక బీసీ వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించిందన్నారు.
సౌకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యం అని అన్నారు. దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికలలో బీజేపీ ట్రైలర్ మాత్రమే చూపించిందని.. ఈ ఎన్నికలలో అందరూ సినిమా చూస్తారని ప్రధాన మంత్రి మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.