తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ప్రజలు ఎంతగానో ఎదురుచూశారని, కానీ.. ప్రజల ఆశలతో కేసీఆర్ ఆడుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం తాండూర్ లో నిర్వహించిన కార్యకర్తల మీటింగ్ లో రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మోసం చేసినట్లే.. ప్రజలను కూడా కేసీఆర్ మోసం చేశారన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు అనుభవిస్తున్న పదవులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అన్నారు. కేసీఆర్ అంత మోసం చేసినా.. ఇటీవల తెలంగాణకు వచ్చిన సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారని గుర్తుచేశారు.
తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల అడ్డాగా మార్చారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 2004లో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. 45 రోజుల్లో మా కష్టాలు తీరుతాయని, తమ కార్యకర్తల్ని బెదిరించినా, అక్రమ కేసులు పెట్టినా.. అంతకు అంతా వడ్డీతో చెల్లిస్తామని కార్యకర్తలకు తెలిపారు. ఎన్నికల సంఘం తాజాగా అధికారులపై వేటు వేయడాన్ని రేవంత్ సమర్థించారు. కానీ.. ఇది సరిపోదని.. రాష్ట్ర డీజీపీని, సైబరాబాద్ కమిషనర్ ను కూడా తొలగించాలని మీడియా ముఖంగా కోరారు. కాంగ్రెస్ నాయకుల ఫోన్లన్నింటిపై నిఘా పెట్టారని, కాంగ్రెస్ నేతలను బెదిరిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులు వారందరిపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టేలా మంత్రి కేటీఆరే కుట్రలు చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయించారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అంతకు అంతా వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. జయేశ్ రంజన్, సోమేష్ కుమార్ లాంటి అధికారులు బీఆర్ఎస్ కు సంపాదించి పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఇంకా 45 రోజులు ఓపిక పడితే.. డిసెంబర్ 3న తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్నారు. కాంగ్రెస్ జెండా .. పేదోడి అండ అన్న స్లోగన్ ను రేవంత్ చెప్పారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు రావాలన్నా, మహాలక్ష్మి, గృహలక్ష్మి పదకాలు రావాలన్నా, యువ వికాసం జరగాలన్నా రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9.. ఎల్బీ స్టేడియంలో లక్షలాది ప్రజల సమక్షంలో 6 గ్యారెంటీల మీద కాంగ్రెస్ పార్టీ సంతకం పెడుతుందన్నారు. డిసెంబర్ 9న అద్భుతం జరుగుతుందని, ప్రజల జీవితాల్లో కొత్తవెలుగు వస్తుందన్నారు.