Red corner notices to the accused in Phone Tapping Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఛానల్ ఎండీ శ్రవణ్ రావులకు త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. ఈ మేరకు ఆ ఇద్దరికి నోటీసులు అందించాలని ఇంటర్ పోల్కు సీబీఐ లేఖ రాసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావులను ఇండియాకు రప్పించేందుకు సిట్ అధికారులు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే వారిద్దిరికి రెడ్ కార్నర్ నోటీసులకు అనుమతి అందించాలని సీబీఐకి సిట్ లేఖ రాసింది. దీనిపై సీబీఐ స్పందించింది.
హైదరాబాద్ సిట్ పంపిన లేఖకు సీబీఐ అనుమతి మంజూరు చేసింది. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. అయితే, ప్రభాకర్ రావు అమెరికాలో గుండెకు సంబంధించిన చికిత్స కోసం వెళ్లగా.. శ్రవణ్ రావు మాత్రం ఇప్పటివరకు ఎవరికీ అందుబాటులోకి రాలేదని సిట్ బృందం వెల్లడించింది.
అయితే, ప్రభాకర్ రావుపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రభాకర్ రావు వర్చువల్ గా విచారణకు హాజరవుతారని దర్యాప్తు బృందం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం దర్యాప్తు బృందం పంపిన విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈ కేసు విషయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
ఫోన్ ట్యాపింగ్ కేసులో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించగా.. ఆరోగ్యం బాగాలేనందున విచారణకు హాజరు కాలేనని సిట్కు ప్రభాకర్ రావు తెలిపారు. దీంతో ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావును హైదరాబాద్కు రప్పించేందుకు సిట్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగానే లేఖ రాసినట్లు తెలుస్తోంది.