Payal Shankar: 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని ఎప్పటినుంచి అమలు చేస్తారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.విద్యుత్ రంగంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో పాయల్ శంకర్ మాట్లాడారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు పరిపాలన సౌలభ్యం కోసం అప్పులు చేయొచ్చని, అయితే, వాటిని సరైన రీతిలో వినియోగిస్తున్నామా? లేదా అన్నది పరిశీలించుకోవాలని పాయల్ శంకర్ సూచనలు చేశారు.
2014కు ముందు రాష్ట్రంలో అసలు విద్యుత్ లేనట్లుగా.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే కరెంట్ వచ్చినట్లు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. విద్యుత్ సంస్థల నష్టాలు చూస్తే ప్రజలు భయపడుతున్నారన్నారు. రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ ఇచ్చినట్లు గత ప్రభుత్వం అబద్ధం చెప్పి మోసం చేసిందన్నారు. ఒక వైపు గత ప్రభుత్వం అప్పులు చేస్తే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ అమలుకు సాధ్యం కాని హామీలిచ్చిందన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో కేంద్ర ప్రభుత్వం చేసిన సాయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని పాయల్ శంకర ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల చొప్పున 95 లక్షల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇవ్వాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి పెరిగిందని పాయల్ శంకర్ ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చిందని, కేంద్రం నుంచి సహాయం అందించలేదని జగదీశ్ రెడ్డి అబద్ధాలు చెప్పడం విడ్డూరమన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చూస్తే జాలి కలుగుతోందని కాంగ్రెస్ సభ్యులు అంటున్నారు. ఇప్పుడే మీకు జాలి కలిగితే విచారణ ఎలా జరుపుతారని ప్రశ్నించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను ఎప్పటినుంచి ఇస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి. అందువల్ల సోలార్ విద్యుత్పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలన్నారు.