Pawan Kalyan: జనసేన పార్టీని పవన్ కల్యాణ్ స్థాపించి 8 ఏళ్లు దాటింది. మరో 3 నెలల్లో 9 ఏళ్లు పూర్తికాబోతోంది. 2014 మార్చి 14న పార్టీని పవన్ ప్రకటించారు. ఎన్నికలకు ఒక నెల ముందే హడావిడిగా పార్టీ ప్రకటన చేశారు. ఏపీ విభజన జరిగిన సమయంలో జనసేన ఏర్పాటు కావడంతో రాజకీయాల్లో ఆసక్తి రేపింది. అయితే ఆ ఎన్నికల్లో అభ్యర్థులను పవన్ కల్యాణ్ నిలబెట్టలేదు. టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న నేత సీఎంగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి బంగారం బాటలు వేస్తుందని ప్రజలను వివరించారు. అనేక సభల్లో పాల్గొని టీడీపీ-బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది.
చంద్రబాబు సీఎం అయిన తర్వాత చాలాకాలం టీడీపీకి మద్దతుగానే పవన్ నిలిచారు. అడపాదడపా కొన్ని అంశాలపై విమర్శలు చేసినా చాలా విషయాల్లో సానుకూల ధోరణితోనే నడిచారు. ఎన్నికలకు ఏడాది ముందు పవన్ కల్యాణ్ రూట్ మార్చారు. టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని విమర్శలు గుప్పించారు. గుంటూరు వేదికగా బహిరంగ సభలో చేసిన ఆరోపణలు రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపాయి. చంద్రబాబును, లోకేష్ ను నేరుగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం రాజకీయ వేడిని మరింత పెంచింది. ఆ సమయంలో వామపక్షాలతో జత కట్టారు. ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. కేంద్రం రాష్ట్రానికి రెండు పాచిపోయిన లడ్డూలు విచ్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలా టీడీపీకి, బీజేపీకి పవన్ దూరంగా జరిగిపోయారు.
2019 ఎన్నికల్లో తొలిసారి జనసేన బరిలోకి దిగింది. వామపక్షాలతో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితం దక్కలేదు. జనసేనాని తాను పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో ఓడిపోయారు. ఆ పార్టీకి కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కింది. ఆ ఒక్క ఎమ్మెల్యే ఏడాది తిరగకుండా వైఎస్ఆర్ సీపీ పంచన చేరిపోయారు. 2019 ఎన్నికల్లో నాలుగైదు స్థానాల్లో మాత్రమే జనసేనకు రెండోస్థానం దక్కింది. పోటీ చేసిన మిగతా అన్ని నియోజకవర్గాల్లో మూడోస్థానానికే పరిమితమైంది. చాలా చోట్ల జనసేన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఉభయగోదావరి,విశాఖ జిల్లాల్లో జనసేనకు కాస్త ఓట్లు వచ్చాయి.
తొలి తప్పిదం
2014లో టీడీపీ, బీజేపీకి మద్దుతు ఇచ్చిన పవన్ కల్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీ చేయాల్సింది. అప్పుడు ఆ పార్టీకి కొన్ని సీట్లు దక్కేవి. ఆ ఎన్నికల్లో పవన్ బరిలోకి దిగుంటే అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం ఉండేది. కానీ పవన్ తొలి అడుగే తప్పటడుగు వేశారు.
రెండో తప్పిదం
2019 ఎన్నికల్లో ఏపీలో ఏ మాత్రం బలంలేని వామపక్షాలతో జతకట్టడం బెడిసికొట్టింది. టీడీపీ, బీజేపీతో నాలుగేళ్లు కలిసి ఉన్నారేకానీ పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ దృష్టిపెట్టలేదు. దీంతో ఆ పార్టీకి ఎన్నికల్లో సరైన అభ్యర్థులు దొరకలేదు. బలమైన అభ్యర్థులు లేకుండా ఎన్నికల బరిలో నిలవడం అంటే ఆయుధాలు లేకుండా యుద్ధం చేయడమే. 2014-2019 మధ్య పార్టీని బలోపేతం చేసుకోకపోవడం, నాయకులను తయారు చేసుకోలేకపోవడం జనసేనాని చేసిన రెండో తప్పిదం.
2024 ఎన్నికల నాటికి పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించి 10 ఏళ్లు పూర్తవుతుంది. దశాబ్దకాలంలో పార్టీ నిర్మాణం చేసుకోకపోవడం జనసేనాని వైఫల్యమే. ప్రత్యర్థులు విమర్శించినట్లుగా పవన్ పార్ట్ టైమ్ పొలిటిషన్ గానే ఉంటున్నారనేది వాస్తవం. ఆ నిజాన్ని ఇప్పుడు గ్రహించినట్లు ఉన్నారు పవన్ కల్యాణ్. తాను పరాజయం పొందిన రాజకీయ నేతనని చెప్పుకొచ్చారు. ఓడిపోయానని చెప్పుకోవడానికి ఏ మాత్రం మొహమాట పడనని అన్నారు.
హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్న జనసేనాని .. తన రాజకీయం జీవితంపై కీలక వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని రేపుతోంది. ‘ఫేసింగ్ ది ప్యూచర్’ అంశంపై సీఏ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన పవన్ కల్యాణ్…తన పరాజయాల గురించి నిర్భయంగా మాట్లాడతానని స్పష్టం చేశారు. పరాజయంలోనే జయం ఉంటుందన్నారు. డబ్బున్న వాళ్లంతా గొప్పోళ్లు, పేరున్న వాళ్లంతా మహానుభావులు అనుకోవద్దని విద్యార్థులుకు సూచించారు. పరాజయాన్ని ఒప్పుకున్న పవన్ ..విజయం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? రాజకీయ భవిష్యత్తు కోసం ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి మరి.