Pawan: తెలంగాణలోనూ రాజకీయ నగారా మోగించారు జనసేనాని. కొండగట్టు అంజన్న సాక్షిగా.. వారాహి వేదికగా.. తెలంగాణ రాజకీయాలపై స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. తాను తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తానని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. పవన్ చేసిన ఈ ప్రకటన స్టేట్ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి.
పవన్ ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారనే ప్రచారం నడుస్తోంది. జనసేనాని ఇప్పట్లో తెలంగాణ వైపు చూసే అవకాశం లేదని అనుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యే ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందని అంచనా వేశారు. కానీ, మేము సైతం అంటూ లేటెస్ట్ గా జనసేనాని తెలంగాణ సమరానికి సై అన్నారు.
7 నుండి 14 పార్లమెంట్ స్థానాలు.. 25 నుంచి 40 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీలో కనీసం 10 మంది జనసేన ఎమ్మెల్యేలు అయినా ఉండాలన్నదే తన కోరిక అని చెప్పారు. పోటీ చేయని స్థానాల్లో కుడా జనసేన ప్రభావం చూపించాలని పిలుపు ఇచ్చారు. పవన్ చేసిన ఈ ప్రకటన.. ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది.
ఇన్నాళ్లూ పవన్ ప్రస్తావన లేకుండా తెలంగాణ పాలిటిక్స్ రన్ అయ్యాయి. ఇప్పుడు జనసేన సైతం ఎన్నికల బరిలో దిగితే.. ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అనే విశ్లేషణలు మొదలయ్యాయి. పవన్ కల్యాణ్ కు ఏపీలానే తెలంగాణ వ్యాప్తంగా విశేష అభిమానులు ఉన్నారనడంలో సందేహం లేదు. మరి, ఆ అభిమానం ఓట్లుగా మారుతుందా? అనేదే ప్రశ్న. ఏపీలానే ఓటమి పాలైనా.. గెలుపును మాత్రం డిసైడ్ చేసే ప్రమాదం ఉందనేది మిగతా పార్టీల బెంగ.
జనసేన పోటీలో ఉంటే ఎన్నోకొన్ని ఓట్లు తప్పక పడతాయి. మరి, ఆ ఓట్లు ఏ పార్టీ గెలుపోటములను ప్రభావితం చేస్తుందనేదే లెక్క. జనసేన పోటీ చేస్తే.. అది బీఆర్ఎస్ కే లాభం చేకూర్చుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. బీజేపీ, కాంగ్రెస్, జనసేనల మధ్య చీలిపోయి.. మళ్లీ బీఆర్ఎస్ కే లబ్ది కలుగుతుందని చెబుతున్నారు. తెలంగాణలో జనసేన, బీజేపీల మధ్య పొత్త లేకపోవడంతో.. ఆ రెండు వర్గాల ఓటుబ్యాంకు సమీకృతం అయ్యే అవకాశం లేదంటున్నారు.
గులాబీ బాస్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటును పవన్ స్వాగతించగా.. తెలంగాణలో జనసేన పోటీని సైతం కేసీఆర్ స్వాగతించే అవకాశం ఉండొచ్చు. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే.. కాపు ఓట్లు చీల్చి జనసేనకు నష్టం చేసి.. వైసీపీకి లాభం జరుగుతుందని అంటున్నారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తే అది కేసీఆర్ కే ప్రయోజనం అని అంచనా వేస్తున్నారు.
అయితే, ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా బీజేపీ, జనసేన పొత్తు కుదిరితే.. సీన్ అమాంతం మారిపోవడం ఖాయం. తెలంగాణలో జనసేనతో పొత్తు కోసం ఎవరైనా వస్తే చూస్తామంటూ పవన్ సైతం ఆ మేరకు సిగ్నల్ ఇచ్చారు. ఏపీలో జనసేనను డ్యామేజ్ చేయాలని బీఆర్ఎస్ చూస్తే.. తెలంగాణలో బీజేపీతో కలిసి కేసీఆర్ ఓటు బ్యాంకును ఇంకా బాగా డ్యామేజ్ చేస్తానంటూ పరోక్షంగా హెచ్చరించారు పవన్ కల్యాణ్..అంటున్నారు.
తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తానని.. పొత్తు ఎవరితో పెట్టుకున్నా.. పొలిటికల్ పవర్లో భాగం తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఇది కూడా ఇంట్రెస్టింగ్ పాయింటే.