Patanjali: ప్రముఖ తెలుగు కథా, నవలా రచయిత పతంజలి శాస్త్రిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన “రామేశ్వరం కాకులు ..మరికొన్ని కథలు” అనే లఘ కథల పుస్తకానికి ఈ అత్యున్నత పురస్కారం లభించింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా రోడ్డులో రబీంద్ర భవన్లోని సాహిత్య అకాడమీ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 24 భాషల్లో రచించిన కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించింది.
పతంజలి శాస్త్రి 1945లో పిఠాపురంలో జన్మించారు. ఆయన ఒంగోలు కళాశాలలో చదువుకున్నారు. ఉన్నత విద్యను తిరుపతి, పుణెలో చదివారు. పుణెలోని ప్రతిష్ఠాత్మక దక్కన్ కాలేజీ నుంచి పురావస్తు శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్ గా పతంజలి శాస్త్రి పని చేశారు. వడ్ల చిలుకలు, పతంజలి శాస్త్రి కథలు, నలుపెరువు వంటి కథా సంపుటాలు ఆయన రచనల్లో ముఖ్యమైనవి. రామేశ్వరం కాకులు నుంచి రోహిణి కథ వరకూ పలు కథలను “రామేశ్వరం కాకులు.. మరికొన్ని కథలు” పేరిట పుస్తకంగా రచించారు. దీనికే ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది.