FarmHouse Case: డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే పలు పరీక్షలు ఫేస్ చేయాలి. పాన్ కార్డు కావాలంటే పూర్తిస్థాయిలో ఆదాయ వివరాలు సమర్పించాలి. ఆధార్ కార్డు అత్యంత పకడ్బందీ వ్యవహారం. పాస్ పోర్టు అయితే పోలీస్ క్లియరెన్స్ మస్ట్. ఇలా ఆయా కార్డు పొందాలంటే సామాన్యులకు అనేక రూల్స్. అలాంటిది, అతని దగ్గర ఏకంగా రెండేసి పాస్ పోర్టులు, మూడేసి ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్సులు ఉండటం పోలీసులనే అవాక్కయ్యేలా చేస్తోంది. అందుకే, రామచంద్ర భారతిపై ఫాంహౌజ్ కేసుతో పాటు పలు కేసులు నమోదవుతున్నాయి.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణలో భాగంగా రామచంద్ర భారతి ల్యాప్ టాప్ లో కీలక సమాచారం సేకరించారు. ఆయనకు రెండు పాస్ పోర్టులు ఉన్నట్టు గుర్తించారు. దీంతో, రామచంద్రభారతిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సిట్ అధికారి.
రెండు పాస్పోర్టులు కలిగి ఉన్నాడని రాజేంద్రనగర్ ఏసీపీ, సిట్ సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రామచంద్రభారతి ల్యాప్టాప్ను పరిశీలించినప్పుడు అందులో రెండు వేర్వేరు నెంబర్లతో రామచంద్రభారతి పాస్పోర్టులు ఉన్నట్టు తేలింది. దీంతో ఆయనపై మరోకేసు నమోదైంది.
పాస్ పోర్టు కేసు మామూలుగా ఉండదు. దేశ భద్రతనే ప్రశ్నార్థకంలో పడేసే అంశం ఇది. పౌరులెవరికైనా ఒకే పాస్ పోర్టు ఉంటుంది. రెండు పాస్ పోర్టులు ఉండటం సీరియస్ కేసుగా పరిగణిస్తున్నారు పోలీసులు. పక్కా పోలీస్ వెరిఫికేషన్ తో ఇచ్చే పాస్ పోర్టును రెండోది ఎలా సంపాదించగలిగారనే దిశగా విచారించనున్నారు. అది నకిలీ పాస్ పోర్టా? లేదంటే, రెండు పాస్ పోర్టులు తీసుకున్నారా? అదెలా సాధ్యం అయింది? అందుకు సహకరించిందది ఎవరు? ఇలా పలు కోణాల్లో దర్యాప్తు చేసేందుకు సిద్దమవుతున్నారు పోలీసులు.
ఇలాంటిదే రామచంద్ర భారతిపై ఇప్పటికే మరోకేసు కూడా ఉంది. ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్లు సైతం ఒక్కోటి 3 చొప్పున ఉండటతో.. ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలోనే రామచంద్రభారతిపై కేసు నమోదైంది.
మొత్తం వ్యవహారం చూస్తుంటే.. రామచంద్ర భారతి మామూలోడు కాదని అనిపిస్తోంది. ఫాంహౌజ్ కేసుతో పాటు.. పాస్ పోర్టు, ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సుల కేసుల్లోనూ ఉచ్చు బిగించేలా.. సీరియస్ గా పావులు కదుపుతోంది తెలంగాణ సర్కారు.