తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. పోలింగ్ కు ఇక 52 రోజులు మాత్రమే ఉంది. మరి పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి? తెలంగాణ ప్రజల నాడి ఎలా ఉంది? బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా? ప్రజలు కాంగ్రెస్ గెలిపిస్తారా? బీజేపీ పరిస్థితి ఏంటి? డిసెంబర్ 3 న ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చేస్తుంది.
హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటించి ఎన్నికల రణరంగానికి సిద్ధమయ్యారు. కొన్ని స్థానాలు మినహా సిట్టింగ్ లకే ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు. ఎన్నికలకు ముందు కొత్త పథకాలు ప్రకటించి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బీసీలకు ,మైనార్టీ లక్ష రూపాయల ఆర్థికసాయం అందించే పథకాన్ని కొద్దికాలం క్రితమే ప్రారంభించారు. నాలుగున్నరేళ్లుగా పెండింగ్ లో రుణమాఫీ పథకాన్ని ఇటీవల అమలు ప్రక్రియ ప్రారంభించారు. ఇలా సంక్షేమ పథకాలనే నమ్ముకుని గులాబీ బాస్ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగుతున్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళిత బంధు పథకాలను కేసీఆర్ గొప్పగా ప్రకటించినా క్షేత్రస్థాయిలో అమలు తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు హడావిడిగా ప్రారంభించిన పథకాల పరిస్థితి అదే విధంగా ఉంది. మరోవైపు తెలంగాణ యువతలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల తీరుపై యువత మండిపడుతున్నారు. నిరుద్యోగుల అంశం ఎన్నికల్లో కీలకంగా మారనుంది.
అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో హస్తం పార్టీ బలపడింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మైనంపల్లి హనుమంతరావు సహా చాలామంది కీలక నేతలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఇంకా చాలా మంది నేతలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి నేతల రావడం చాలా సానుకూల అంశంగా మారింది. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న యువ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది.
గతేడాదే వరంగల్ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లేరేషన్ , కొన్నినెలల క్రితం ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ డిక్లేరేషన్ ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించారు. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం బీజేపీపై పడింది. కాషాయ పార్టీ రాష్ట్రంలో బాగా డీలా పడింది. ఖమ్మం, సికింద్రాబాద్ సభల్లో అమిత్ షా పాల్గొన్నారు. ఇటీవల ప్రధాని మోదీ వెంటవెంటనే రెండు కార్యక్రమాల్లో పాల్గొన్ని బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. కానీ బీజేపీలో కొత్త నాయకులు చేరలేదు. బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక తెలంగాణ నాలుగో ముఖ్యమైన పార్టీ ఎంఐఎం. ఆ పార్టీ తన పట్టును నిలుపుకునే అవకాశం ఉంది. కచ్చితంగా 7 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది. మరి తెలంగాణలో చాలా చోట్ల పోటీ చేస్తామని ఎంఐఎం నేతలు గతంలో ప్రకటించారు. ఆ పార్టీ ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.