తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభమవ్వగా.. ప్రతిపక్ష పార్టీ నేతగా మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ సభలో ప్రకటించారు. అనంతరం సభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం మొదలైంది. ఈ తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రతిపాదించగా.. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ బలపరిచారు. గవర్నర్ ప్రసంగం పై ధన్యవాదాల తీర్మానం గురించి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్ల ప్రభుత్వ పాలనలో ఎన్నో నిర్బంధాలకు గురయ్యామన్నారు. వికారాబాద్, పరిగి సెగ్మెంట్ లో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా గత ప్రభుత్వం ప్రారంభించలేదన్నారు. రాబోయే వంద రోజులలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు.
గత ప్రభుత్వం ఇంట్లో ఒకరికి మాత్రమే పెన్షన్ ఇచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ పెన్షన్ ఇస్తుందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన 24 గంటల్లోనే ప్రగతి భవన్ కంచెల్ని తొలగించి.. ప్రజలకు చేరువగా పాలనను ప్రారంభించామన్నారు. బీసీల కులగణన చేపట్టి.. ప్రతి జిల్లాకు బీసీ భవన్ ఏర్పాటు చేస్తామన్నారు. ధరణి స్థానంలో భూమాతను ఏర్పాటు చేస్తామని, బెల్ట్ షాపులను రద్దు చేస్తామని తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీ తరహాలో మరో నాలుగింటిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ఫార్మాసిటీని రద్దు చేయడంతో పాటు.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పారు. రీ డిజైన్ పేరుతో బీఆర్ఎస్ తమ ప్రాంతానికి తీరని అన్యాయం చేసిందని, తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో పరిగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు.
.
.