Parents Complaint Against Son in Wanaparthy(Telangana news): నవమాసాలు మోసి అమ్మ ప్రాణం పోస్తే..ఆ జీవనానికి జీవితం ఇచ్చేది నాన్న. అలాంటి పిల్లల అభ్యున్నతి కోసం తల్లిదండ్రులు నిరంతరం తపన పడుతుంటారు. అయితే అలాంటి తల్లిదండ్రులపై కొంతమంది క్రూరంగా ప్రవర్థిస్తుంటారు. తాజాగా, విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తమ కుమారుడిని చదివించి సీఐని చేస్తే..ఏకంగా తల్లిదండ్రులపైనే దాడికి దిగాడు. అయితే సీఐ నుంచి తమకు ప్రాణహాని ఉందని, ఎలాగైనా మాకు రక్షణ కల్పించాలని డీజీపీకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వనపర్తి జిల్లాలోని ఖిల్లాఘనపురం మండలం వెంకటాయింపల్లిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాయింపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి, బొజ్జమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని పెద్ద కుమారుడు నాగేశ్వర్ రెడ్డిని ఉన్నత చదువులు చదివించి సీఐని చేయగా.. చిన్న కుమారుడు యాదయ్య కానిస్టేబుల్ అయ్యాడు. ఇందులో పెద్ద కుమారుడు రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2 లో సీఐగా విధులు నిర్వహిస్తున్నాడు.
ఇదిలా ఉండగా, గత కొంతకాలంగా ఆస్తి విషయంలో నాగేశ్వర్ రెడ్డి..తల్లిదండ్రులకు చిత్రహింసలు పెడుతున్నాడు. రఘునాథ్ రెడ్డి పేరు మీద మొత్తం 30 ఎకరాల 23 గుంటలు ఆస్తి ఉంది. ఇందులో పెద్ద కుమారుడికి 15 ఎకరాలు, చిన్న కుమారుడికి 11 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించారు. మిగతా 4 ఎకరాల23 గుంటలను ఇద్దరు కూతుళ్లకు ఇచ్చేందుకు ఆ తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. అయితే 15 ఎకరాలు తీసుకున్న పెద్ద కుమారుడు.. మిగతా భూమిని కూడా తనకే కావాలని అంటున్నాడు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఇవ్వమని చెప్పడంతో గత కొంతకాలంగా కొడుతున్నాడు.
Also Read: బీఆర్ఎస్ గుట్టురట్టు.. కవిత కేసుపై క్లారిటీ, ఢిల్లీ టూర్ అందుకేనా?
ఆస్తి విషయంలో చిన్న కుమారుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే మమ్మల్ని కొడుతున్నారని తల్లిదండ్రులు వాపోయారు. చివరికి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని తల్లిదండ్రులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అయితే, ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తోబుట్టువులకు తానే దగ్గరుండి పంచాల్సింది పోయి..ఆ భూమిని కొట్టేందుకు ఏకంగా కన్న తల్లిదండ్రులుకు చిత్ర హింసలు గురిచేయడం ఏంటని పలువురు ఆరోపిస్తున్నారు.