హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలనే డిమాండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో వచ్చింది. అప్పట్లో సీమాంధ్ర నాయకులు ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేయాలని కోరారు. అలాగే భాగ్యనగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచాలని డిమాండ్ చేశారు. కానీ అప్పటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్ రాజధానిగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిని చేయాలని డిమాండ్ ఉంది. దేశ రాజధాని ఢిల్లీ ఉత్తర భారత్ లో ఉంది. అందుకే దేశానికి దక్షిణాదిలో రెండో కేపిటల్ ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ రక్షణ కోసం వ్యూహాత్మకంగా మరో రాజధాని ఉండాలని మేధావులు చెబుతున్నారు. అలాంటి సమయాల్లో హైదరాబాద్ పేరే వినిపిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేయడం కొత్త చర్చకు దారితీసింది.
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అలాగే బెంగళూరు, చెన్నై, ముంబై కూడా కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారే రోజులు ఎంతో దూరంలో లేవని స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రాంతీయ పార్టీలను అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు.
ఢిల్లీ బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చలో అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కోసం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత బిల్లు ద్వారా గౌరవసభ హోదాను ఎన్డీఏ ప్రభుత్వం కించపరుస్తోందని మండిపడ్డారు.
బీజేపీ, ఆప్ మధ్య రాజకీయ పోరాటాన్ని పార్లమెంట్ వెలుపల చూసుకోవాలని కేంద్రానికి ఒవైసీ సూచించారు. కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల థింక్ ట్యాంక్ నుంచే బయటకు వచ్చారని అభిప్రాయపడ్డారు. ఆయన కేంద్రం మనిషేనని ఆరోపించారు. బీజేపీ అధికారంలో లేనప్పుడు కేజ్రీవాల్ ను ఆ స్థానంలో ఉంచాలనుకుంటోందని ఒవైసీ విమర్శలు చేశారు.