BRS MLAs Defection Into Congress: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ అద్భుతంగా పనిచేస్తోంది. ఇప్పటికే ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇంకో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని.. సీఎం రేవంత్ రెడ్డి మరో సిక్సర్ కొట్టబోతున్నారని విప్ ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలకు బలం చేకూర్చేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
శనివారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శనివారం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కొట్టే మరో సిక్సర్ వీరే అని టాక్ నడుస్తోంది. శ్రీధర్ బాబుతో భేటీ అయిన వారిలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు.
నియోజకవర్గాల అభివృద్ధికోసమే మంత్రి శ్రీధర్ బాబును కలిసినట్లు ఎమ్మెల్యేలు పేర్కొన్నప్పటికీ.. త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే వార్తలు జోరందుకున్నాయి. పార్టీలో చేరి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి బలం చేకూర్చండి.. తోడ్పాటు అందించండి.. ఈ రోజు కాకపోయినా రేపైనా దీని గురించి ఆలోచించండి అంటూ మంత్రి ఎమ్మెల్యేలను కోరినట్లు తెలుస్తోంది.
Also Read: ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్.. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ గద్వాల ఎమ్మెల్యే
ఒకవేళ ఈ ఆరుగురు కారు దిగి హస్తం గూటికి చేరితో జీహెచ్ఎంసీ పరిధిలో కీలక నియోజకవర్గాలు హస్తగతం కానున్నాయి. ఇప్పటికే ఒక్కోనేత కాంగ్రెస్ పార్టీలో చేరుతుండగా బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.