Hyderabad: ఏపీ, తెలంగాణ, ఢిల్లీ, ముంబయి, కోల్కతా, అస్సాం, బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, ఉజ్బెకిస్తాన్, రష్యాలకు చెందిన యువతులు. మొత్తం 14,190 మంది. ఎవరు కావాలంటే వాళ్లు. ఫిజిక్ ను బట్టి రేటు. అంతా ఆన్ లైన్లోనే దందా. వాట్సాప్ గ్రూపులు, వెబ్ సైట్లు, కాల్ సెంటర్లతో విటులకు ఎర. డీల్ కుదిరితే ఫ్లాట్స్, ఫాంహౌజ్స్, ఓయో రూమ్స్ లో యవ్వారం. అంతా గప్ చుప్. చాలాకాలంగా సాగుతోంది ఈ గలీజు దందా. కేవలం వ్యభిచారం మాత్రమే కాదు.. కావాలంటే డ్రగ్స్ కూడా అరేంజ్ చేస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా విస్తరించిన ఈ వ్యభిచార దందాను పక్కాగా ఆర్గనైజ్ చేస్తున్నది ఒకే ఒక్కడు. అంతమంది యువతులను, ఆన్ లైన్ డీల్స్ చేసే విధానాన్ని చూసి పోలీసులే అవాక్కయ్యారు. గ్యాంగ్ లీడర్ ను అదుపులోకి తీసుకున్నారు.
దేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ వ్యభిచార ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ముఠా ఉచ్చులో ఏకంగా 14,190 మంది మహిళలు, యువతులు చిక్కుకున్నట్టు సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరించారు. వారికి డ్రగ్స్ అలవాటు చేసి.. వారితో విటులకు కూడా డ్రగ్స్ సరఫరా చేయించి.. పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నట్టు గుర్తించారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్ ప్రాంతానికి చెందిన అర్నవ్ ఒక్కడే ఇంత పెద్ద దందా రన్ చేస్తున్నట్టు తేల్చారు. అర్నవ్ కనీసం తన డీటైల్స్ ముఠాలో ఎవరికీ తెలీకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. కనీసం అతన్ని చూసిన వాళ్లు గానీ, అతని ఫోటో కానీ.. ఎక్కడా లేకుండా పక్కా ప్రొఫెషనల్ గా గ్యాంగ్ ను నడిపించాడని పోలీసులు తెలిపారు.
సైబరాబాద్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం చాలా కాలంగా నిఘా పెట్టి.. పకడ్బందీగా దర్యాప్తు చేసింది. ముఠాకు చెందిన 17 మందిని అరెస్టు చేసి.. 39 కేసులు పెట్టారు. నిందితుల నుంచి 34 సెల్ ఫోన్లు, 3 కార్లు, ల్యాప్టాప్, 2.5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు.