Moinabad : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో సోమవారం రోజు జరిగిన మహిళ మర్డర్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. మొయినాబాద్ మండలంలోని బాకారం గ్రామ శివారులో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ కు వెళ్ళే దారిలో మిట్ట మధ్యాహ్నం యువతిని హతమార్చి.. మృతదేహాన్ని గుర్తించకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. స్థానిక రైతులు కొందరు రోడ్డు పక్కన కాలుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికి మృతదేహాం కాలుతూనే ఉండడంతో రైతుల సాయంతో మంటలు ఆర్పారు.
మంటల్లో కాలిపోతున్న మహిళ ఎవరు? ఎలా చనిపోయింది? ఇక్కడే చంపి తగలబెట్టారా ? లేదంటే వేరేచోట చంపి ఇక్కడకు తీసుకొచ్చారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.యువతి వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 80 శాతం మృతదేహం కాలిపోగా.. ఆమెకు వివాహమైనట్లు గుర్తులేవీ కనిపించకపోవడంతో యువతికి ఇంకా పెళ్లి కాలేదన్న నిర్ధారణకు వచ్చారు. యువతి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్యకు కారకులైన నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. దుండగులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
అలానే ఈ కేసు కోసం క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఎస్ బీ బృందాలను రంగంలోకి దించారు. దర్యాప్తులో భాగంగా డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పరిసరాలను క్లూస్ టీం పరిశీలించింది. అలాగే మహిళ మృత దేహాం పక్కన సగం కాలిన ఫోన్ను గుర్తించిన పోలీసులు.. ఆ సెల్ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఇక సమీప గ్రామాల వారిని సైతం పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో గత రెండు, మూడు రోజులుగా మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదు అయ్యాయా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి త్వరలోనే వివరాలు అందిస్తామని పోలీసులు తెలిపారు.