Komatireddy : కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ మరోసారి సంచనల వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో భేటీ తర్వాత కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం అల్పాహార విందులో ఠాక్రేతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. ఈ ఇద్దరు మధ్య గంటకుపైగానే చర్చలు జరిగాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు తనపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఠాక్రే దృష్టికి తీసుకొచ్చారని తెలుస్తోంది.
నియోజకవర్గ పర్యటన ఉండటం వల్లే తాను బుధవారం మాణిక్ రావు ఠాక్రేను కలవలేకపోయానని కోమటిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలు సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి ఎందుకు ఠాక్రేను కలవలేదో ముందు వారిని అడగాలన్నారు. పీసీసీ కమిటీలను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. కానీ పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం జరిగిందని మండిపడ్డారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేస్తే ఏఐసీసీ పట్టించుకోలేదన్నారు. తన ఫొటో మార్ఫింగ్ చేశారని స్వయానా సీపీనే చెప్పారని గుర్తు చేశారు.నాలుగైదుసార్లు ఓటమి పాలైన వాళ్లతో తాను కూర్చోవాలా? అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.
మునుగోడు ఉపఎన్నికకు ముందు నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పీసీసీ కమిటీల్లో స్థానం దక్కకపోవడంతో అసంతృప్తి వెళ్లగగ్గారు. ఆ తర్వాత ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. పార్టీ జాతీయ కమిటీలో స్థానం కల్పిస్తామని ఖర్గే హామీ ఇచ్చి పంపించారు. అయినా సరే కోమటిరెడ్డి ధోరణిలో మార్పురాలేదు. ఖర్గేను కలిసిన తర్వాత రోజు నిధుల పేరుతో ప్రధాని మోదీని కలిసొచ్చారు. ఆయన సోదరుడు బాటలోనే బీజేపీలోకి వెళతారనే ప్రచారం చాలాకాలం సాగుతోంది. అందువల్లే పార్టీ నేతలపై బహిరంగ విమర్శలు చేస్తున్నారని అనుమానాలు కలుగుతున్నాయి.
మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా మాణిక్రావు ఠాక్రే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ నేతలతో సమావేశమై కీలక చర్చలు జరిపారు.