IT Raids : హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ మధ్య కాలంలో వరుసగా ఐటీ అధికారులు సోదాలు చేపట్టడం రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా ఐటీశాఖ ప్రముఖ స్థిరాస్తి రంగ సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు చేస్తోంది. స్థిరాస్తి రంగ సంస్థ డైరెక్టర్లు, సీఈవోల కార్యాలయాలు, ప్రతినిధుల ఇళ్లు, ప్రధాన సంస్థ అనుబంధ సంస్థల కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కేపీహెచ్బీలోని లోధా అపార్ట్మెంట్స్లోని ఊర్జితా కన్స్ట్రక్షన్స్ ఎండీ శ్రీనివాస రెడ్డి, శ్రీఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కోటారెడ్డి, అతని కుమారుడు ఆదిత్య రెడ్డి ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 50 ఐటీ బృందాలు తనిఖీల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
వివిధ రియల్ ఎస్టేట్ సంస్థలు ఐటీ రిటర్న్స్ దాఖలులో అవకతవకలు జరిగినట్లు ఐటీ శాఖ గుర్తించింది. గడిచిన ఐదేళ్లలో ఐటీ రిటర్న్స్ వివరాలను ఆయా సంస్థల అకౌంట్స్ విభాగం నుంచి ఐటీ అధికారులు తీసుకుంటున్నారు. కీలక డాక్యూమెంట్లను పరిశీలిస్తున్నారు. ఆ వివరాలు ఆధారం ఎంతమేరకు ఆదాయపన్ను ఎగవేశారనే లెక్కలు కడుతున్నారు. తాజాగా చేపట్టిన సోదాల్లో సేకరించిన వివరాలు ఆధారంగా ఆయా సంస్థలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
కొన్ని రోజుల క్రితం వివిధ రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఐటీశాఖ అధికారులు దాడులు చేపట్టారు. అంతకుముందు సినీ నిర్మాతల టార్గెట్ గా దాడులు చేశారు. ఆ సమయంలో మైత్రీమూవీ మేకర్స్ అధినేతల ఇళ్లు , ఆ సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ చిత్రాలను నిర్మిస్తున్న నేపథ్యంలోనే ఈ దాడులు జరిగాయని ప్రచారం జరిగింది. అంతకుముందు తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థలు, ఆయన ఇళ్లతోపాటు, బంధువులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లలో ఐటీదాడులు జరగడం కలకలం రేపింది. గత ఆరు నెలల్లో తెలంగాణలో ఐటీ, ఈడీ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. రెండునెలల క్రితం గ్రానైట్ కంపెనీలే లక్ష్యంగా ఈడీ దాడులకు దిగింది. ఆ సమయంలో మంత్రి గంగుల కమలాకర్, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇళ్ల, కార్యాలయాల్లో ఈడీ దాడులు చేసింది. ఇలా ఏదో ఒక కేసులో ఐటీగానీ, ఈడీగానీ దాడులు చేపట్టడం తెలంగాణలో నిత్యకృత్యంగా మారింది.