Traffic Restrictions on Tank Bund : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జరుపుకునేందుకు రాష్ట్రమంతా ముస్తాబవుతోంది. హైదరాబాద్ లో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ తదితర ప్రాంతాల్లో అమరవీరుల స్థూపం వద్ద వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి నుంచి సోమవారం అర్థరాత్రి వరకూ.. 24 గంటల పాటు సాధారణ వాహనాలను ట్యాంక్ బండ్ పైకి అనుమతించబోమని ట్రాఫిక్ అడిషినల్ సీపీ వెల్లడించారు.
సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్, రవీంద్రభారతి నుంచి ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ నుంచి ట్యాంక్ బండ్, జీహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలన్నింటినీ దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. అవతరణ దినోత్సవ వేడుకలకై..ప్రస్తుతం రిహార్సల్స్ జరిగే మార్గంలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ముఖ్యంగా ఆదివారం ఉదయం 9 – 10 గంటల వరకూ గన్ పార్క్ వైపు ట్రాఫిక్ ను అనుమతించమని స్పష్టం చేశారు. నాంపల్లి టి జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను బషీర్ బాగ్ బీజేఆర్ విగ్రహం వైపు మళ్లిస్తారు. సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలకు కూడా అనుమతి లేదు. అలాగే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఉదయం 10 -11 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.