Resignations In Telangana : తెలంగాణలో ఎన్నికల ఫలితాల తర్వాత.. కేసీఆర్కు అత్యంత సన్నిహితులుగా ఉన్న అధికారులు.. ఒక్కొక్కరుగా తమ పదవుల నుంచి తప్పుకుంటున్నారు. ఇప్పటికే టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ పదవికి డి.ప్రభాకరరావు రాజీనామా చేశారు. తాజాగా ఇంటెలిజెన్స్ OSD టి. ప్రభాకర్రావు కూడా రిజైన్ చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖ ఉన్నతాధికారులకు అందించారు.
ప్రభాకర్ రావు గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పదవీ విరమణ చేశారు. అయితే తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మూడేళ్లపాటు ఓఎస్డీ బాధ్యతలు అప్పగించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ప్రభాకర్రావు రాజీనామా చేశారని తెలుస్తోంది. ప్రతిపక్షాల ఫోన్లను ప్రభాకర్రావు ట్యాపింగ్ చేస్తున్నారని గతంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఆరోపించారు.
అలాగే వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు కూడా రాజీనామా చేశారు. సీఎస్కు లేఖలు పంపించారు. గజ్జెల నగేష్, మేడె రాజీవ్ సాగర్, ఆంజనేయులు గౌడ్, దూది మెట్ల బాలరాజ్ యాదవ్, రవీందర్ సింగ్, వాసుదేవరెడ్డి, మన్నే క్రిశాంక్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లె రవికుమార్ గౌడ్, జగన్ మోహన్రావు, అనిల్ కూర్మాచలం, సతీష్ రెడ్డి, రామచంద్రనాయక్, గూడూరి ప్రవీణ్, వాల్యా నాయక్ తమ కార్పొరేషన్ ఛైర్మన్ పదవులకు రాజీనామా చేశారు.
టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి. ప్రభాకరరావు తన రాజీనామా లేఖను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభాకర్రావు సీఎండీగా బాధ్యతలు పదవి చేపట్టారు.
టాస్కఫోర్స్ OSD రాధాకిషన్ రావు కూడా రాజీనామా చేశారు. మూడేళ్ల క్రితం ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత ప్రభుత్వం OSD గా బాధ్యతలు అప్పగించింది.