Basara IIIT news today(Latest news in telangana): నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు.. విద్యార్థులపై మరోసారి తమ కర్కశాన్ని ప్రదర్శించారు. విద్యార్థులు సెలవుపై వెళ్లిన సమయంలో.. వారి రూం తాళాలు తీసి వస్తువులను బయటపడేశారు. అధికారులు చేసిన పనితో విలువైన పుస్తకాలు, దుస్తులతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా పోగొట్టుకున్నామని వారు వాపోయారు.
బాసర ట్రిపుల్ ఐటీకి మే ఐదో తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. సెలవులకు వెళ్లేవారు తమతమ వస్తువులను తీసుకెళ్లడం సాధారణమే. అయితే పీయూసీ 2 విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు పూర్తి కాలేదు. దీంతో వారంతా తమతమ పుస్తకాలు, వస్తువులను వారి గదుల్లోనే పెట్టి సొంతూళ్లకు వెళ్లిపోయారు.
సెలవులు పూర్తవుతున్న క్రమంలో బాసర హాస్టల్ అధికారులు.. విద్యార్థులకు ఎలాంటి సమాచారం అందించకుండా వారి వస్తువులను గదుల నుంచి బయటపడేశారు. హాస్టల్ భవనం మెట్ల కిందకు చేర్చారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారుల తీరు పట్ల మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో లక్షలాది రూపాయల విలువైన పుస్తకాలు, వస్తువులు పోగొట్టుకున్నామని వాపోతున్నారు.