NTR: తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. మే 28 ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించనున్నారు. ముఖ్యఅతిథిగా రావాలని ఎన్టీఆర్ను పువ్వాడ ఆహ్వానించారు.
ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. టాలీవుడ్ హీరో, ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఈ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. ఈ నెల 28న విగ్రహావిష్కరణ జరపనుండగా, దానికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ… జూనియర్ ఎన్టీఆర్ తో చర్చించారు.
ఖమ్మంలో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గతేడాదే నిర్ణయించారు. శ్రీకృష్ణుడి రూపంలోని ఈ ఎన్టీఆర్ విగ్రహం నిర్మాణానికి 4 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతి కావడంతో, ఆ రోజున ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వెనుక రాజకీయ కోణం వెతుకుతున్నారు. ఖమ్మంలో ఏపీ, తెలంగాణ మిక్స్డ్ వాతావరణం ఉంటుంది. ఓ వర్గం ఆధిపత్యమూ ఎక్కువే. అందుకే, వ్యూహాత్మకంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడుతున్నారనే రాజకీయ విమర్శలూ వినిపిస్తున్నాయి.
మరోవైపు, ఇటీవలే కొమురంభీం ఎన్టీఆర్తో.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా భేటీ అయ్యారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ను ఆకట్టుకోవడమే బీజేపీ స్కెచ్ అని అన్నారు. మీరేనా.. మేము సైతం అంటూ.. ఇప్పుడు మంత్రి పువ్వాడ అజయ్.. ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ను రప్పించి.. ఆయన క్రేజ్ను తమ ఓటు బ్యాంక్గా మార్చుకోవాలని చూస్తున్నారని కూడా అంటున్నారు. తాత విగ్రహం కాబట్టి మనువడిని పిలుస్తున్నాం.. అనేది పువ్వాడ వెర్షన్. ఏదిఏమైనా.. ఈమధ్య అటు ఏపీ, ఇటు తెలంగాణ రాజకీయాల్లో ఎన్టీఆర్ పేరు గట్టిగానే వినిపిస్తుండటం ఆసక్తికరం.