Aroori Ramesh Meets KCR: హనుమకొండలో బుధవారం జరిగిన పొలిటికల్ హైడ్రామా అందరికీ తెలిసిందే. ఉదయం నుంచీ జరిగిన ఈ హై ఓల్టేజ్ పొలిటికల్ డ్రామాకు తెరపడింది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్.. బీఆర్ఎస్ ను వీడి.. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న వేళ.. బీఆర్ఎస్ నేతల ఎంట్రీతో సీనంతా రివర్సైంది. వరంగల్ ఎంపీ సీటు ఇచ్చేందుకు నిరాకరించడంతో.. ఆరూరి రమేశ్ బీఆర్ఎస్ కు రాజీనామా ప్రకటన చేసి.. బీజేపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగిన నేపథ్యంలో.. పార్టీ సీనియర్ నేత హరీష్ రావు ఆదేశాల మేరకు బస్వరాజు సారయ్య, సుందర్ రాజ్ యాదవ్, ఇతర పార్టీ నేతలు బుధవారం ఉదయం ప్రశాంత్ నగర్ లోని ఆరూరి నివాసానికి వెళ్లారు.
అక్కడ ప్రెస్ మీట్ లో మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. దాంతో ఆరూరి రమేశ్ కిడ్నాపయ్యారన్న వార్తలొచ్చాయి. బీఆర్ఎస్ నేతల్ని అడ్డుకునేందుకు ఆరూరి అనుచరులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బలంవంతంగా ఆయన్ను బుజ్జగించారు. హరీష్ రావుతో ఫోన్ లో మాట్లాడించి.. పార్టీ అధిష్టానం కోరింది ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆరూరి రమేశ్.. చివరి నిమిషంలో వస్తే ఎలా అని కన్నీళ్లు పెట్టుకున్నారు.
కొద్దిసేపటికే ఆరూరి రమేశ్ ఎర్రబెల్లి కారులో ఎక్కారు. ఆ వాహనాన్ని అడ్డుకునేందుకు ఆయన అనుచరులు ప్రయత్నించగా.. బీఆర్ఎస్ నేతలు నిలువరించారు. ఈ క్రమంలోనే ఆయన్ను కిడ్నాప్ చేశారని వార్తలొచ్చాయి. సాయంత్రానికి హైదరాబాద్ లో కేసీఆర్ నివాసానికి చేరుకున్న ఆరూరి.. తననెవరూ కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేశారు. పార్టీ నేతలు తనను వరంగల్ నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చారని, కేసీఆర్ తో చర్చల కోసమే వచ్చినట్లు తెలిపారు. పార్టీ వీడకుండా ఆరూరిని బుజ్జగించిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ సీటుపై హామీ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.