TS Budget : తెలంగాణ అసెంబ్లీలో నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్ రావు తన ప్రసంగంలో ఎక్కువ సమయం ప్రభుత్వం చేసిన పనులు గురించి చెప్పేందుకే కేటాయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందని లెక్కలతోసహా వివరించే ప్రయత్నం చేశారు. ఏ ప్రాజెక్టులు ఎంత వరకు పూర్తి అయ్యాయో వివరించారు. ఆయా ప్రాజెక్టులకు చేసిన ఖర్చులను చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. సాధించిన విజయాల గురించి చెప్పుకొచ్చారు. దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా మారిందని స్ఫష్టంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వెనుకబడిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రూపురేఖలు మార్చివేసి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు.
కేంద్రంపై నిందలు..
బడ్జెట్ ప్రసంగంలో ప్రారంభంలోనే హరీశ్ రావు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కేంద్రం సమాఖ్య స్పూర్తికి విరుద్దంగా రాష్ట్ర నిధులకు కోత పెడుతోందని ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం సహకరించడం లేదని మండిపడ్డారు. ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర విభజన హామీలను పరిష్కరించలేదని ఆరోపించారు. జలవివాదాల విషయంలో ట్రిబ్యునల్స్ పేరుతో కేంద్రం దాటవేత ధోరణిలో ఉందని మండిపడ్డారు. కేంద్రం తీరుతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు.
అభివృద్ధి మంత్రం..
తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని హరీశ్ రావు వివరించారు. టీఎస్ ఐపాస్ విధానం విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చిందని వివరించారు. ఐటీ ఎగుమతుల్లో 2021-22 సంవత్సరానికిగాను 26.14 శాతం వృద్ధితో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకుందని తెలిపారు. ఐటీ పరిశ్రమను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ విస్తరిస్తున్నామన్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో ఐటీ టవర్లను నిర్మించామన్నారు. నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ, సిద్ధిపేటలో ఐటీ టవర్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు.
కొత్త పథకాలేవి?
ఎన్నికల ఏడాది కావడంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటిస్తుందని ప్రజలు ఆశించారు. కానీ హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా కొత్త పథకాల ప్రస్తావన రాలేదు. పాత పథకాల నిధులు కేటాయింపులనే ప్రకటించారు. మరి ఓటర్లకు తాయిలాలు ఎందుకు ప్రకటించలేదు. అమల్లో ఉన్న పథకాలపై ప్రచారం చేసుకుంటే చాలు అని ప్రభుత్వం భావించిందా? గత అనుభవాలు దృష్ట్యా పథకాలను ప్రకటించి సరిగ్గా అమలు చేయకపోతే అసలుకే మోసం వస్తుందని అనుకుందా? మొత్తంమీద ఆశించిన రీతిలో తెలంగాణ బడ్జెట్ లో సామాన్యులపై వరాలు కురవలేదని అనుకుంటున్నారు.