తెలంగాణ కొత్త సీఎం ఎవరనే చర్చ తెరపైకి రాగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఢిల్లీ బాట పట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క హైకమాండ్ పెద్దల్ని కలిశారు. మంతనాలు చేశారు. ఒక్క రేవంత్రెడ్డి మాత్రం హైదరాబాద్లోనే ఉన్నారు. 48 గంటలుగా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లోనే ఉన్నారాయన. ఎలాంటి లాబీయింగ్ లేకుండా.. రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుపోతున్నారు.
మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డితో సమావేశం అవుతున్నారు. తమ మద్దతు తెలుపుతున్నారు. ఇదే విషయాన్ని హైకమాండ్కు సైతం తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. మరోవైపు.. రేవంత్రెడ్డిని కలవడానికి వివిధ శాఖల అధికారులు క్యూ కడుతున్నారు. ఫ్లవర్ బొకేలు అందించి రేవంత్కు శుభాకాంక్షలు చెబుతున్నారు. హోటల్లో రేవంత్రెడ్డి ఉంటున్న రూమ్కు పోలీసులు భద్రత పెంచారు.