No Confidence Motion : నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 48 మంది కౌన్సిలర్లలో 41మంది కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేశారు. బీఆర్ఎస్కు అనుకూలంగా ఐదుగురు నిలబడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన 8వ వార్డు కౌన్సిలర్ న్యూట్రల్గా ఉన్నారు. ఓటింగ్కు ఒక సభ్యుడు గైర్హాజరయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ పార్టీకి ఇది ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. 2020లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో.. ఎక్స్ ఆఫీషియో ఓట్లతో మందడి సైదిరెడ్డి ఛైర్మన్గా ఎన్నికయ్యారు. తాజాగా అవిశ్వాసం నెగ్గటంతో 33వ వార్డు బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఛైర్మన్గా ఎన్నికయ్యే అవకాశం ఉందని సమాచారం. తాత్కాలిక ఛైర్మన్గా ప్రస్తుత వైస్ ఛైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్ కొనసాగనున్నారు.
ఇక గులాబీ గెలిచిన పలుచోట్ల మున్సిపల్ ఛైర్మన్లపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. కారు పార్టీ తిరుగుబాటు కౌన్సిలర్లు సహా కాంగ్రెస్, MIM, బీజేపీ నేతలు సైతం ఛైర్మన్లను గద్దే దింపేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఛైర్మన్లకు పదవీగండం తప్పేలా లేదు.
ఉమ్మడి పాలమూరు జిల్లా మున్సిపాలిటీలో అవిశ్వాస సెగలు రాజుకున్నాయి. మహబుబ్ నగర్, జడ్చర్ల, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, మున్సిపల్ ఛైర్మన్లపై అవిశ్వాసం పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకోసం ఆ పార్టీ నేతలు సైతం రహస్య మంతనాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 49 మంది కౌన్సిలర్లతో మహబూబ్నగర్ మున్సిపల్ పాలక వర్గం కొలువు దీరింది. బీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్మన్ నర్సింహ్ములుపై సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీతో పాటు మొత్తం 32మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్కు తీర్మానాన్ని అందజేశారు.
జడ్చర్లలో అవిశ్వాస తీర్మానాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ నేతలు వ్యూహాలు వేస్తున్నారు. అవిశ్వాసం కాకుండా రాజీనామా చేయించి కొత్తవారిని ఎన్నుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంట్లో బీఆర్ఎస్ నేతలు రహస్య మంతనాలు నిర్వహిస్తున్నారు. జడ్చర్ల మున్సిపల్ ఛైర్పర్సన్ భర్త దోరపల్లి రవీందర్పై కౌన్సలర్లు గుర్రుగా ఉన్నట్టు సమాచారం.
కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి గెలుపు తర్వాత మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ కన్ను పడింది. కల్వకుర్తి మున్సిపల్ ఛైర్మన్ ఎడ్మ సత్యంను మార్చేందుకు కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. మొత్తం 22 మంది కౌన్సిలర్లలో 6గురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నాగర్ కర్నూల్లో మొత్తం 24మంది కౌన్సిలర్లు ఉండగా అందులో 7గరు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.