Niti Aayog Meeting Today(Breaking news of today in India): శనివారం న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. వికాస్ భారత్ 2047 లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది. చిన్న,మధ్య తరహా పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు– పెట్టబడులు, వ్యాపార వర్గాలకు సులభతరమైన విధానాలు, మహిళాసాధికారత, ఆరోగ్యం, పౌష్టికాహారం, నైపుణ్యాభివృద్ధి, గతిశక్తి ఏరియా డెవలప్మెంట్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై నీతిఆయోగ్ పాలక మండలిలో చర్చ జరగనుంది. మీటింగ్కు హాజరయ్యేందుకు.. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నా రు.
ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను తీసుకొచ్చింది బీజేపీ నేతృత్వంలోని కేంద్రం. ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. భవిష్యత్ నిర్ణయాలను, సాధించాల్సిన లక్ష్యాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే దేశం , రాష్ట్రాల ప్రగతికి సీఎంల నుంచి సలహాలు, సూచనలు కూడా స్వీకరించనున్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్న రాష్ట్రాలకు తమకు సహాయం అందించాల్సిందిగా.. నీతి ఆయోగ్ మీటింగ్లో కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లొచ్చు.
నీతి ఆయోగ్ సమావేశంలో వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించడంతోపాటు, కేంద్రం నుంచి సహాయాన్ని కోరనున్నారు జగన్. ఇప్పటికే సమీక్ష నిర్వహించిన జగన్.. నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలిచ్చారు. ఆరోగ్యం, పౌష్టికాహారం రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చరిత్రాత్మక మార్పులను నీతి ఆయోగ్ వేదికపై రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. ఫ్యామిలీ డాక్టర్, ఎన్సీడీఎస్ల నియంత్రణ, ఆరోగ్యశ్రీ, ఆస్పత్రుల్లో నాడు-నేడు, తల్లులు, పిల్లలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ, ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది నియామకం.. తదితర అంశాలను వివరించనుంది.
సీఎం కేసీఆర్ ఈ సమావేశానికి హాజరుకావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. గత ఏడాది జరిగిన నీతి ఆయోగ్ మీటింగ్కు కూడా కేసీఆర్ గైర్హాజరు అయ్యారు. ఆ మీటింగ్తో వచ్చే ఉపయోగం లేదని అంటున్నారు. ఐతే తెలంగాణకు కేంద్రం ఏం చేయడం లేదని గట్టిగా విమర్శించే కేసీఆర్.. ఇలాంటి కీలక మీటింగ్లకు హాజరుకాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.