TS IPS Officer Got Promotions : పోలీసు అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం తొమ్మిది మంది ఐపిఎస్ అధికారులకు పదోన్నతులు కల్పించారు. ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే పదోన్నతి తీసుకుని కొనసాగేలా ఆదేశాలు జారీ చేశారు. హోంగార్డ్ ఐజిగా ఉన్న 1999 బ్యాచ్ ఐపిఎస్ అధికారి ముత్యాల స్టీఫెన్ రవీంద్రకు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పదోన్నతి కల్పించారు. అదే విధంగా వెల్ఫేర్ అండ్ సోర్ట్ ఫుల్ అదనపు బాధ్యతలనూ అప్పగించారు. ADGగా ప్రస్తుతం ఉన్న స్థానంలోనే స్టీఫెన్ రవీంద్ర కొనసాగనున్నారు. ఐపీఎస్ రెగ్యులర్ రిక్రూట్ 2006 బ్యాచ్కు చెందిన ఇంటెలిజెన్స్ డీఐజీ కార్తికేయకు ఐజిగా పదోన్నతి కల్పించారు.
Read More : మెట్రో 2.O.. 7 కారిడార్లకు గ్రీన్ సిగ్నల్.. త్వరలో శంకుస్థాపన
స్టేట్ పోలీస్ సర్వీస్ 2006 బ్యాచ్కు చెందిన రమేష్ నాయుడు, ఏవీ రంగనాథ్, వి. సత్యనారాయణ, బి.సుమతీ, ఎం. శ్రీనివాసులుకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ సిఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వీరు ఉన్న స్థానాల్లో కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 2010 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారులు న్యాలకొండ ప్రకాష్ రెడ్డి, డి.జోయల్ డేవిస్కు డీఐజీలుగా పదోన్నతి కల్పించారు. ప్రకాష్ రెడ్డి జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ డైరెక్టర్గా ఉండగా, జోయల్ డేవిస్ సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్గా ఉన్నారు. వీరిని అదే స్థానంలో కొనసాగిస్తూ ఉత్తర్వుల జారీ చేశారు.