Mallareddy : ఇటీవలే ఐటీ దాడులు ఎదుర్కొన్న మల్లారెడ్డికి కొత్త టెన్షన్ మొదలైంది. మంత్రి కేంద్రంగా మరో వివాదం రాజుకుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇప్పుడు షాక్ ఇచ్చారు. మంత్రి వైఖరిపై కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న నేతలు ఒక్కటయ్యారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో మేడ్చల్ జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలు భేటీకావడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆ ఎమ్మెల్యే సుమారు రెండు గంటలపాటు పలు కీలక అంశాలపై ఎమ్మెల్యేలు చర్చించారు. మల్కాజ్ గిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లో మంత్రి తలదూర్చడంపై ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, భేతి సుభాష్ రెడ్డి మండిపడుతున్నారు.
కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లికి సంబంధించి మార్కెట్ కమిటీ ఛైర్మన్ మార్పు విషయంలో స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా వేరే వ్యక్తికి అవకాశం కల్పించడంపై ఎమ్మెల్యే వివేకానంద అసంతృప్తిగా ఉన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామని కానీ తొందరపడి జీవో ఇచ్చారని భేటీ తర్వాత వివేకానంద తెలిపారు. ఇది రహస్య భేటీ కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలమంతా ఒక్కమాటపై ఉన్నామని తేల్చిచెప్పారు.
మంత్రి మల్లారెడ్డి తమకు ఏ విషయంపైనా సమాచారం ఇవ్వడం లేదని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అంసతృప్తిగా ఉన్నారని తాజా భేటీతో బయటపడింది. మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు భేటీ కావడం సంచలనంగా మారింది. ఇదే అంశంపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్తే పరిస్థితి ఏంటని మల్లారెడ్డి ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. మరి ఆ నేతలతో సయోధ్య కుదుర్చుకుంటారో లేదా చూడాలిమరి.
మంత్రి మల్లారెడ్డి తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. కొంతకాలం క్రితం రెడ్డి సంఘం మీటింగ్ లో వేదికపై ఆయన ప్రసంగిస్తుండగానే కొందరు అడ్డుకున్నారు. అయినా తగ్గకుండా మల్లారెడ్డి ఆ సభకు హాజరు ప్రతినిధుల అభిమతానికి వ్యతిరేకంగా మాట్లాడటంతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి మల్లారెడ్డి వెళ్లిపోవాల్సి వచ్చింది. అలాగే ఈ మధ్య తన విద్యాసంస్థల్లో జరిగిన కార్యక్రమంలో రెడ్డి అమ్మాయిలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత నాలుక కరుచుకుని క్షమించాలని కోరారు. ఇటీవల మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగాయి. ఈ టెన్షన్ నుంచి బయటపడకముందే సొంత పార్టీ ఎమ్మెల్యేలే మంత్రిని టార్గెట్ చేయడం ఆసక్తిని రేపుతోంది.