TCongress : వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. దీని కోసం ఇప్పటికే బీఆర్ఎస్ సర్కార్పై విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్న హస్తం నేతలు.. ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్కు కూడా తెర లేపారు. మరి గెలుపు గుర్రాల కోసం టీకాంగ్ చేపట్టిన ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? ఇంతకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంటి?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం వచ్చింది. కాంగ్రెస్ పార్టీని వీడే వారి సంఖ్య తగ్గిపోగా పార్టీలో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదునుగా భావించిన కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. ఘర్ వాపసీ పేరుతో ఆపరేషన్ షురూ చేసింది.
పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కే లక్ష్మీనారాయణతో గతవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల
ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే భేటీ అయ్యి పార్టీలో యాక్టివ్ కావాలని కోరారు. దీనితో ఆయన తాను పార్టీలోనే ఉన్నాననే ప్రకటన ఇచ్చారు. గాంధీభవన్ లో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సైతం మాజీ ఎమ్మెల్యే KLR పాల్గొన్నారు.
ఇక ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ లో చేరిన నిర్మల్ మాజీ ఎమ్మెల్యే యేలేటి మహేశ్వర్ రెడ్డితో కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మహేశ్వర్ రెడ్డి తిరిగి పార్టీలో చేరేందుకు సానుకూలంగా ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీ పార్టీలో వున్న ఇద్దరు మాజీ ఎంపీలతో కాంగ్రెస్ పార్టీ సంప్రదిపులు జరుపుతోంది. ఇక మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చలు పూర్తి చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఈ నెలాఖారులోపు వీరి చేరిక ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మాజీమంత్రి జూపల్లి కూడా అందర్నీ ఏకతాటిపైకి తెస్తాననీ, ఈనెల లోనే తన నిర్ణయం చెప్తామని చెబుతున్నారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర రెడ్డి తన కొడుకుతో సహా కాంగ్రెస్ లో చేరేందుకు సముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తన కుమారుడికి నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తే కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనం కానుంది.
ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాబూరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగినా ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇక అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలతోనూ కాంగ్రెస్ పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతోపాటుగా ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత లేని నేతలంతా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇక రెండు ప్రధాన పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతల పేర్లను తయారు చేసి వారితో కాంగ్రెస్ అగ్రనేతలు మాట్లాడే విధంగా టీ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉన్న నేతలతో రాహుల్ గాంధీ టీమ్ మాట్లాడి పార్టీలో చేరితే దక్కే ప్రాధాన్యతలపై హామీలిస్తున్నారు.
ఈ నెలలో భారీ చేరికలకు టీ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. బీజేపీలో నెలకొన్న నైరాశ్యం కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందని హస్తం నేతలు భావిస్తున్నారు. అందివచ్చిన అవకాశం ఉపయోగించుకునేందుకు టీ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.