TSPSC Exam age limit Increased to 46: ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. 46 ఏళ్ల వరకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధంగా వయో పరిమితి సడలింపుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి త్వరలోనే టీఎస్పీఎస్సీ గ్రూప్-1 నిర్వహిస్తామని శాసనసభలో ప్రకటించారు. కొన్ని నిబంధనల కారణంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యమైందని.. త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్ను విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా వయో పరిమితి 46 ఏళ్లకు పెంచాలని తీసుకున్న నిర్ణయంతో జీవో విడుదల చేశారు.
టీఎస్పీఎస్సీ గ్రూపు-1 పోస్టుల భర్తీ కోసం మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టీఎస్పీఎస్సీ ఇప్పటికే పూర్తి చేయగా.. సుప్రీంకోర్టులో కేసు కొంత వరకు అడ్డంకిగా మారింది. దీంతో తాజాగా ఆ కేసును ప్రభుత్వం ఉపసంహరించుకునేందుకు సిద్ధమవ్వడంతో.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలకు లైన్ క్లియరైంది. పేపర్ లీకేజీతో మొదటి సారి గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దవ్వగా.. రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీకి అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకపోవడంతో అక్రమాలకు అవకాశం ఉండటంతో పాటు ఓఎంఆర్ షీట్ల సంఖ్యలోనూ తేడాలున్నాయని అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు.
Read More: గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్షలకు లైన్ క్లియర్
హైకోర్టు ఆ పరీక్షను రద్దుచేయగా.. గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్లింది. తాజాగా ప్రభుత్వం ఈ కేసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది. అప్పట్లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 503 పోస్టులతో.. మరో 60 పోస్టులను కలిపి మొత్తం 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వడంలో ఆ అప్పీల్ అడ్డంకిగా మారింది. దీంతో ఈ నెల 19న ఇదే అంశంపై సుప్రీంకోర్టులో అప్పీల్పై విచారణ జరగనుంది. కొత్త సర్కారు ఇప్పటికే ఆ అప్పీల్ను విత్డ్రా చేసుకుంటామని పేర్కొంటూ పిటిషన్ వేసింది. ఈనెల 19న పిటిషన్ విత్డ్రాకు కోర్టు అంగీకరిస్తే.. ఆ వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.