NDA meeting today live updates(Telugu breaking news): ఢిల్లీ వేదికగా ఎన్డీయే బలప్రదర్శనకు దిగింది. ప్రతిపక్షాల ఐక్యతా సమావేశానికి ధీటుగా సమావేశం ఏర్పాటు చేసింది. లోక్సభ ఎన్నికలకు ఇంకా ఏడాదిలోపే సమయం ఉండటంతో విపక్షాల వ్యూహాలను తిప్పికొట్టేలా పక్కా ప్రణాళికను బీజేపీ రచిస్తోంది. గత 9 ఏళ్లుగా నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు, తీసుకున్న నిర్ణయాలు సహా వివిధ అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమాలను దేశవ్యాప్తంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. పొత్తులు, ఎన్డీఏ కూటమిని విస్తరించడం, ప్రతిపక్ష పార్టీలతో పాటు కొత్త పార్టీలను ఎన్డీఏలోకి ఆహ్వానించడం చేస్తోంది. గతంలో ఎన్డీఏలో ఉండి తర్వాత బయటికి వెళ్లిన వారిని కూడా మళ్లీ చేర్చుకుంటోంది. ఇటీవలి కాలంలో ఎన్డీఏ కూటమి మరింత విస్తృతమవుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.
మరోవైపు, బెంగళూరులో జరిగిన విపక్షాల మీటింగ్పై ప్రధాని మోడీ తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి పరులంతా ఒకే చోట కలిశారని దేశ ప్రజలు చీదరించుకుంటున్నారని మండిపడ్డారు. కెమెరా ముందుకు వచ్చి ప్రతిపక్ష నాయకులు ఐక్య సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ప్రజలకు మాత్రం వాళ్ల అవినీతే గుర్తుకు వస్తోందని ఎద్దేవా చేశారు.
ఇక, తెలుగు రాష్ట్రాల నుంచి పవన్ కల్యాణ్కు మాత్రమే ఎన్డీఏ ఆహ్వానం అందింది. చంద్రబాబుకు ఎలాంటి పిలుపు రాలేదు. వైసీపీ మాత్రం తాము బీజేపీ, కాంగ్రెస్కు సమాన దూరమని చెబుతోంది. అయితే ఢిల్లీలో అధికారం చేపట్టాలంటే అది ఏపీ నుంచే మొదలవుతుందంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కూడా ఎన్డీఏ ఆహ్వానం అందలేదు. జాతీయ పార్టీగా తాము కాంగ్రెస్, బీజేపీకి సమదూరం అని కేసీఆర్ చెబుతున్నారు. అయితే ఇటీవల రాహుల్ గాంధీ ఖమ్మం పర్యటనలో కేసీఆర్పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ బీజేపీకి బీటీమ్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్పై కుట్రల్లో భాగంగానే ఎత్తుగడలని మండిపడ్డారు. విపక్షాల సమావేశానికి తాము కేసీఆర్ను పిలవడం లేదని.. పిలిచే ఉద్ధేశం కూడా లేదని రాహుల్ క్లారిటీ ఇచ్చారు.