National Women Commission(Hyderabad news today): హైదరాబాద్ లో ఓ యువతిని వివస్త్రను చేసిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ నెల 6న జవహర్నగర్ బాలాజీ నగర్ పరిధిలో నడిరోడ్డుపై ఓ కీచకుడు యువతిని వివస్త్రను చేశాడు. ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ అమానుష చర్య హైదరాబాద్లో మహిళ భద్రతలపై ఆందోళన కల్గిస్తోందని పేర్కొంది. వారంలోగా నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. దర్యాప్తు చేసి యువతికి న్యాయం చేయాలని స్పష్టం చేసింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీనగర్ లోని శివాజీనగర్కు చెందిన పెద్దమారయ్య మద్యానికి బానిసగా మారాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఆదివారం రాత్రి అలాగే గొడవ పడ్డాడు. ఆ తర్వాత తన తల్లితో కలిసి మారయ్య రోడ్డు దాటుతున్నాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న యువతిపై దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆమె మారయ్య చెంపపై కొట్టింది. దీంతో ఆ యువతిపై అతడు దాడి చేశాడు. దుస్తులు లాగి వివస్త్రను చేశాడు. పక్కనే ఉన్నా మారయ్య తల్లి కుమారుడిని నిలువరించే ప్రయత్నం చేయలేదు.
మారయ్య దుశ్చర్యను ఓ మహిళ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆమెపై కూడా దాడి చేశాడు. కొద్దిసేపటి తర్వాత కొంతమంది మహిళలు వచ్చి యువతిపై కవర్లు కప్పారు. ఈ కేసులో నిందితుడు పెద్దమారయ్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు. సంచలన రేపిన ఈ ఘటనపై తాజాగా జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. హైదరాబాద్ శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది.