Narsireddy: నన్నూరి నర్సిరెడ్డి. తెలుసుగా ఈ టీడీపీ యువ నేత. మామూలుగా ఉండవు ఇతని మాటలు. మాట్లాడితే పంచులే పంచులు. జబర్దస్త్ సెటైర్లు. టీడీపీ స్పోక్ పర్సన్ గా ఫుల్ పాపులర్. ఇప్పటికీ టీటీడీపీలోనే ఉండటం ఆయన కమిట్మెంట్ కి నిదర్శనం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంతగా యాక్టివ్ గా లేకపోవడంతో నర్సిరెడ్డి మెరుపులు తగ్గాయి. కేవలం మహానాడుకే పరిమితమయ్యాయి ఇతని ప్రసంగాలు. అయితే, గురువారం టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు సమక్షంలో.. టీటీడీపీ అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సిరెడ్డి స్పీచ్ మరోసారి పటాకాలా పేలింది.
కేసీఆర్ పై సెటైర్లు వేయడంలో నర్సిరెడ్డి ఫేమస్. బాగా అలవాటైన విద్య కావడంతో.. మరోసారి గులాబీ బాస్ పై రెచ్చిపోయారు. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని చాలామంది అన్నారని కానీ.. ఇప్పుడు ఐటీలో నార్త్ ఇండియన్స్, హోటల్స్లోకి ఒరిస్సా వాళ్లు, వ్యాపారంలోకి రాజస్థాన్ వాళ్లు, రైళ్లలో బిహార్ వాళ్లు వచ్చారని.. ఆంధ్రవారికి తిట్లు, తెలంగాణ వారికి తిప్పలు మిగిలాయంటూ తనదైన స్టైల్ లో స్పీచ్ దంచేశారు.
ఎంట్రన్స్ పరీక్షలో ఫెయిల్ అయిన అభ్యర్థి మేనేజ్మెంట్ కోటాలో సీటు తెచ్చుకున్నట్టు.. ఎంపీగా ఓడిపోయిన కవితకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన కేసీఆర్.. రాష్ట్రంలోని నిరుద్యోగుల గురించి ఆలోచించడం లేదని మండిపడ్డారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పారని కానీ.. కేసీఆర్ ఇంట్లో ఐదుగురికి ఉద్యోగాలు వచ్చాయని.. 150 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని నర్సిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రాంత అభివృద్ధి, హైదరాబాద్ ఐటీ డెవప్మెంట్ వెనుక చంద్రబాబు నాయుడి విజన్ ఉందని నర్సిరెడ్డి అన్నారు. దేవాదుల, కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే ప్రారంభం అయ్యాయని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతానికి ఎంతో చేసింది కానీ, చెప్పుకోవడంలో విఫలం అయ్యామన్నారు. గడీల రాజ్యాన్ని అంతం చేసి గరీబోళ్ల రాజ్యం తీసుకొచ్చిన చరిత్ర టీడీపీదన్నారు. తెలంగాణ గడ్డ తెలుగుదేశం అడ్డగా చేయడం కోసం కార్యకర్తలంతా పునరంకితం కావాలని పిలుపు ఇచ్చారు నన్నూరి. చాలా రోజుల తర్వాత నర్సిరెడ్డి పంచ్ లు విన్న టీడీపీ వాళ్లంతా.. వారెవా.. క్యా స్పీచ్ హై అంటున్నారు.