Narayankhed Congress Meeting : కాంగ్రెస్ ను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభకు జనం భారీగా పోటెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను రేవంత్ ఎండగట్టారు. అబద్దాలు చెప్పడంలో, ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ తో ఎవరూ పోటీ పడలేరని సెటైర్లు వేశారు.
నారాయణఖేఢ్ బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డిపైనా రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన అక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. వక్ఫ్ బోర్డు భూములను కూడా దోచుకున్నారని ఆరోపించారు. సర్పంచ్ లకు బిల్లులు రావాలంటే భూపాల్ రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు.
ఇందిరమ్మ రాజ్యంతోనే నారాయణఖేడ్ సమస్యలకు పరిష్కారమవుతాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని కోరారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పు మళ్లీ జరగవద్దన్నారు.
బరాబర్ డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
తండాలను అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ దేనని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల గురించి వివరించారు. ప్రగతి భవన్ కు అంబేడ్కర్ పేరు పెడతామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు తెలంగాణలో లేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఈ పథకం అమలు చేస్తామని ప్రకటించారు. నారాయణఖేడ్ సంజీవరెడ్డిని గెలిపించాలని కోరారు. మార్పుకావాలంటే.. కాంగ్రెస్ రావాలి అని రేవంత్ పిలుపునిచ్చారు.