CPI Narayana Comments: హైడ్రా కూల్చివేతలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. మాదాపూర్ లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు.
‘పేదలు గజం స్థలం ఆక్రమిస్తేనే నానా రాద్ధాంతం చేస్తారు.. నాగార్జున బిగ్ బాస్ కే బాస్. చెరువును ఆక్రమించుకుని కబ్జాలు చేశారు. ఆయనేం సత్యహరిశ్చంద్రుడు కాదు.. ఆ ఎన్ కన్వెన్షన్ మీద రోజుకు రూ. లక్షల ఆదాయం వస్తున్నది. ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. అందువల్ల ఆయనకు ఇదంతా పెద్ద లెక్క కాదు. సినిమా డైలాగులు పనికిరావు. ఒక్కడే కూర్చొని వందమందిని కొట్టేస్తే నడవదు. రోజుకు ఎంత సంపాదించాడో అదంతా కక్కించాలి.
Also Read: నెక్లెస్ రోడ్డు తొలగిస్తారా?: హైడ్రాపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా చెరువులో కాలేజీలు కట్టారు. వారంతా కబ్జాకోరులు. ఫిరంగి నాలాను వాళ్లు కబ్జా చేశారు. చెరువులు, నాలాలు కబ్జా అయితే ఊర్లు మునిగిపోతాయి. ఆరంభ శూరత్వం కాదు. ఎక్కడ కబ్జా జరిగినా ఖాళీ చేయించాలి. పెద్దలు కబ్జాలు చేసినా, దొంగపట్టాలు పొందినా వారి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. రాజకీయ కక్ష సాధింపు అవసరంలేదు. ఒకే పార్టీ, ఒకే వర్గం మీద కక్ష సాధింపు అనేది మంచిదికాదు. ఎవరు ఆక్రమించినా కూడా వాటిని హైడ్రా కూల్చివేయాలి. ఈ కూల్చివేతలు ఇలాగే కంటిన్యూ కావాలి. అదేవిధంగా ఈ అక్రమ నిర్మాణాలకు ఎవరు అనుమతిచ్చారో వారిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మేం మొదటి నుంచి భూ సమస్యలపైనే పోరాటం చేస్తున్నాం’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.