NTR: ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు. తొడగొట్టి ఢిల్లీకి దడపుట్టించిన రాజకీయ ఉద్దండుడు. 80ల్లోనే నేషనల్ ఫ్రంట్తో చక్రం తిప్పిన నాయకుడు. వెండితెర ఇలవేల్పు. పేదల పాలిట దేవుడు. తారకరాముడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. భారతరత్న ఇవ్వడానికి ఆయనకేం తక్కువ? ఇదే ప్రశ్న అడిగారు ఎర్రజెండా హీరో ఆర్.నారాయణమూర్తి. ఎన్టీఆర్ శతజయంతి వేడుకకు హాజరైన ఆయన.. వేదికపైనుంచే అక్కడే ఉన్న చంద్రబాబును, పురంధేశ్వరిలను గట్టిగా నిలదీయడం ఆసక్తికరంగా మారింది.
నారా చంద్రబాబు గారు అంటూనే.. నైస్గా నిగ్గదీసి అడిగారు మూర్తన్న. మీరు గతంలో ఎన్డీయే ప్రభుత్వంలో ఉన్నారుగా.. ఆ సమయంలోనే ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాల్సిందిగా కేంద్రంతో పోరాడితే బాగుండేదిగా అంటూ నిలదీశారు. ఈపాటికి భారతరత్న వచ్చుండేదిగా అన్నారు. చంద్రబాబు అడిగినా వాళ్లు ఇవ్వలేదని.. అప్పుడే ఎన్డీయే నుంచి బయటకు రావాల్సిందని అన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, ఇప్పుడు మళ్లీ పోరాడండి ఏమైతది అంటూ మూర్తన్న రెచ్చిపోయారు. ఆయన మాటలకు నవ్వుతూనే, అవునన్నట్టు తలఊపారు చంద్రబాబు.
పోనీ, చంద్రబాబు అడగలేదు. మరి, ప్రస్తుతం బీజేపీలో ఉన్న పురంధేశ్వరి అయినా కేంద్రానికి చెప్పి ఆమె తండ్రి నందమూరి తారకరామారావుకు భారతరత్న ఇప్పించొచ్చుగా? అన్నారు. వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ వేసినందుకు సంతృప్తి పడొద్దని.. భారతరత్న వచ్చేలా ప్రయత్నించాలని కోరారు. పురంధేశ్వరి సైతం చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు.
అప్పట్లో ఇందిరాగాంధీ.. తమిళనాడుకు చెందిన MGRతో అవసరం ఉండి ఆయనకు భారతరత్న ఇచ్చారని.. కానీ, ఆయన స్వీకరించలేదని గుర్తు చేశారు. MGR కంటే NTR ఎందులో తక్కువంటూ, మరి అన్నగారికి ఎందుకు భారతరత్న ఇవ్వలేదని.. అంతా దుర్మార్గం, కుట్ర అంటూ తనదైన స్టైల్లో మాట్లాడారు మూర్తన్న.
నిజమే, ఆర్.నారాయణమూర్తి వ్యాఖ్యలు అక్షర సత్యాలే. ఎన్టీఆర్ పేరు చెప్పి రాజకీయాలు, శతజయంతిలు చేస్తున్నారే కానీ, ఓ ఉద్యమంలా, ఓ పోరాటంలా.. ఆయనకు భారతరత్న సాధించేందుకు ముందుకు రావడం లేదు. వినతిపత్రాలు, డిమాండ్లతో పని కాదు. పోరాడితేనే.. భారతరత్న వచ్చేది..ఇచ్చేది. ఆ దిశగా కేంద్రం మెడలు వంచేలా రాజకీయాలకు అతీతంగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని అన్నగారి అభిమానులు కోరుకుంటున్నారు.