NTR : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు దివికేగి 27 ఏళ్లు పూర్తైంది. ఎన్టీఆర్ 27వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి బాలకృష్ణ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ తిరుగులేని శక్తిగా రాణించారని గుర్తు చేశారు. ఆ మహనీయుడ పాలనా సంస్కరణలు, అందించిన సేవలు చరిత్రలో మైలురాయిగా నిలుస్తాయన్నారు. తెలుగోడి గుండెల్లో ఎన్టీఆర్ కు ప్రత్యేక స్థానం ఉందని బాలయ్య స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో పార్టీలను ఏకంగా చేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన విషయాన్ని బాలయ్య గుర్తు చేశారు.
మహానుభావుడిని ప్రతిఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని బాలయ్య అన్నారు. కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని సంపాదించుకోవడం ఎన్టీఆర్కే సాధ్యమైందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అనేది ఎన్టీఆర్ ఇచ్చిన గొప్ప ఆస్తి అని ఇది కేవలం పార్టీ మాత్రమే కాదు.. ఒక వ్యవస్థ వివరించారు. టీడీపీకి ఉన్న కార్యకర్తలు మరే పార్టీకి లేరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. ప్రతి కార్యకర్త పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని అయినా సరే ఎప్పుడు తలవంచకుండా ముందుకు వెళ్లారని స్పష్టం చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని బాలకృష్ణ అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి తాతయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ సమాధి వద్దకు వచ్చిన పుష్పగుచ్ఛాలు ఉంచి ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.