Nandakumar : ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. మాటలతో మాయ చేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య అని తెలుస్తోంది. బడా వ్యాపారాలను సైతం ముగ్గులోకి దించి ముంచేయడమే నైజమని పోలీసులు నిర్ధారించారు. ఇలా నందకుమార్ అక్రమాల చిట్టా చాలా పెద్దదే ఉందని అర్ధమవుతోంది. సిట్ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి.
నందకుమార్ బ్యాంకు ఖాతాలు, సెల్ఫోన్లను విశ్లేషించిన సిట్ అధికారులకు కీలక ఆధారాలు దొరికాయి. నందకుమార్ ఆర్థిక లావాదేవీలు బయటపడ్డాయి. అతడు చాలామందికి ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినట్లు సిట్ గుర్తించింది. నందు చేతిలో మోసపోయిన వ్యాపార భాగస్వాములు, ఆర్థిక లావాదేవీల్లో నష్టపోయినవారు పోలీసులను ఆశ్రయించారని తెలుస్తోంది. బాధితులు ఇచ్చిన ఆధారాలను సిట్ పరిశీలిస్తోంది. నందుపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో నందకుమార్తోపాటు రామచంద్రభారతి, సింహయాజి నిందితులుగా ఉన్నారు. నందు జాబితాలో మరో ఏడుగురు స్వామీజీలు ఉన్నారని పోలీసులు గుర్తించారు. రాజకీయ నాయకులు, వ్యాపార ప్రముఖులను ప్రసన్నం చేసుకుని స్వామీజీలతో పూజలు చేయించడమే నందు వ్యాపారం. స్వామీజీలు హైదరాబాద్ వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేయడం, విమానాశ్రయం నుంచి కారులో తీసుకురావడం, హోటళ్లలో ఆతిథ్యం ఇవ్వడం, పూజల సందర్భంగా తొలుత ప్రముఖుల తరఫున తానే స్వామీజీలకు భారీ దక్షిణ సమర్పించడం, తర్వాత అదును చూసి వారితో పనులు చేయించుకోవడం వంటి వ్యవహారాలు భారీగానే జరిగినట్లు గుర్తించారు.
నందకుమార్ అనేక వ్యాపారాలు సాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఏడు వ్యాపార సంస్థలను నిర్వహించారని తేల్చారు. నందు వల్ల మోసపోయామని ఓ గుట్కా సంస్థ నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారని తెలుస్తోంది. గతంలో ఆ సంస్థ ట్రేడ్మార్క్పై వివాదం తలెత్తింది. ఆ సంస్థ అమ్మేందుకు రూ. కోట్లలో డీల్ మాట్లాడదామని చెప్పి నందకుమార్ మోసగించినట్లు సమాచారం. బాధితులు ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసే యోచనలో పోలీసులున్నారు. ఇలా నందకుమార్ అక్రమాలు, మోసాలు జాబితా చాలా పెద్దదే ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.