HMDA Shiva Balakrishna arrest news(Telangana news today): అక్రమాస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ బుధవారం ముగిసింది. దీంతో ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. మరో 14 రోజులు రిమాండ్ను పొడగించింది. అయితే ఎనిమిది రోజుల విచారణలో శివబాలకృష్ణ చెప్పిన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వాటిని కూడబెట్టేందుకు ఆయన అనుసరించిన విధానాల్ని చూసి ఏసీబీ అధికారులే నిర్ఘాంతపోతున్నారు.
శివబాలకృష్ణ అక్రమాస్తుల విలువ వెయ్యి కోట్ల రూపాయలకు పైనే ఉండొచ్చని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తులో కీలక అంశాలు వెల్లడి అవుతుండడంతో.. మరిన్ని వివరాలు రాబట్టేందుకు శివబాలకృష్ణ రిమాండ్కు పొడగించాలని కోర్టును కోరింది. దీంతో శివబాలకృష్ణ రిమాండ్ను 14 రోజుల పాటు కోర్టు పొడగిస్తున్నట్లు ప్రకటించింది.
ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను చంచల్గూడ జైలుకు తరలించారు. ఇప్పటి వరకు రూ.250 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణ పేరుతో 214 ఎకరాలు భూమి ఉన్నట్లు ఏసీబీ జాయింగ్ డైరెక్టర్ వెల్లడించారు. తెలంగాణతోపాటు విశాఖపట్నంలో కూడా శివబాలకృష్ణకు 29 ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 19 ఓపెన్ ప్లాట్లు, 7 ఫ్లాట్లు, 3 విల్లాలు ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా శివబాలకృష్ణకు ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేయనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ కేసు సంబంధించి హెచ్ఎండీఏలో పలువురు అధికారులు పాత్రపై కూడా సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. పలు ఫైల్స్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. లాకర్స్లో ఉన్న బంగారం, ఆస్తులకు సంబంధించి పలు కీలక పత్రాలను సీజ్ చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు.