Nakrekal Congress Meeting : తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నకిరేకల్ కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న రేవంత్.. కాంగ్రెస్ కు కోటి 50 లక్షల ఓట్లు వస్తాయని స్పష్టం చేశారు. నల్గొండను తల్చుకుంటే.. తనకు వెయ్యి ఏనుగుల బలం వస్తుందన్నారు.
నల్గొండ గడ్డపై గులాబీ జెండా కనబడనీయవద్దని రేవంత్ పిలుపునిచ్చారు. ఆ పార్టీకి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్కసీటు కూడా రాకూడదన్నారు. పార్టీ ఫిరాయించిన 12 మందిలో ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వవద్దని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.
దోచుకుతినే బకాసురుడు.. ఫాంహౌజ్లో పడుకునే కుంభకర్ణుడు కేసీఆర్ అని రేవంత్ విమర్శించారు. ఇసుక మీద ఎవరైనా మేడిగడ్డ లాంటి బ్యారేజీ కడతారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలపై రూ. 6 లక్షల కోట్ల అప్పు పెట్టారని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో పాలన కంటే బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ ప్రజలకు ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు.
సభా వేదికపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ప్రశంసలతో రేవంత్ ముంచెత్తారు. తెలంగాణ వచ్చే వరకు పదవి తీసుకోకుండా కోమటిరెడ్డి ఆదర్శంగా ఉన్నారని కితాబిచ్చారు. ఆయనకు పేరు వస్తుందనే ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టును పూర్తి చేయలేదని కేసీఆర్ పై విమర్శలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాను తలుచుకుంటే..ఇక కాంగ్రెస్ కు తిరుగుండదన్నారు.
హెలికాప్టర్ సమస్య ఉన్నా రోడ్డుమార్గంలో తుంగతుర్తి వచ్చాను. పేదవాడి కష్టాలు కేసీఆర్ కు తెలియదు. నీళ్లు, నిధులు , నియామకాల పేరిట పదేళ్లుగా కేసీఆర్ ప్రజలను మోసం చేశారు.
ఆ తర్వాత తుంగతుర్తిలో కాంగ్రెస్ విజయభేరి సభకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ నిరుద్యోగులను నిండా ముంచారని మండిపడ్డారు. కేసీఆర్ ఇంట్లో మాత్రం నియామకాలు జరిగాయన్నారు. ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి కేసీఆర్ కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తామని రేవంత్ సెటైర్లు వేశారు.