Nagarjuna Sagar : నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల పోలీసు వలయంలో సాగర్ ప్రాజెక్ట్ ఉంది. సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఏపీ-తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. సాగర్ డ్యాం వద్దకు 1600 ఏపీ పోలీసులు చేరుకున్నారు. అలాగే భారీగా తెలంగాణ పోలీసులు చేరుకుంటున్నారు.
సాగర్ ప్రాజెక్ట్ వద్ద పరిస్థితిని తెలంగాణ నీటి పారుదుల శాఖ సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ సమీక్షించనున్నారు. రెండు రోజులుగా పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి సాగర్లోనే మకాం వేశారు. గురువారం సాగర్ కుడికాలువకు తాగునీటిని విడుదల చేసి, ఏపీ జనవరుల శాఖ పంతం నెగ్గించుకుంది. సాగర్ పై ఆధిపత్యం కోసం ఏపీ – తెలంగాణ ప్రభుత్వాలు కాలుదువ్వుతున్నాయి.
మరోవైపు.. ఏపీ పోలీసులపై కేసు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. నాగార్జున సాగర్ విజయపురి టౌన్ పీఎస్లో కేసు నమోదైంది. A-1గా ఏపీ పోలీస్ ఫోర్స్ ను చేర్చారు. తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకొచ్చారని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఫిర్యాదు చేశారు. 500 మంది సాయుధ బలగాలతో సాగర్ డ్యామ్పైకి ఏపీ పోలీసులు వచ్చారంటూ ఫిర్యాదు చేశారు. ప్రధాన డ్యామ్లోని 13 నుంచి 26 గేట్ల వరకు ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. కుడికాల్వ 5వ గేటు నుంచి ఏపీకి నీరు విడుదల చేశారు. కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా నీటిని విడుదల చేశారని తెలంగాణ పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 447, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.