నాగార్జున సాగర్ జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. డ్యామ్ పై అటు ఏపీ, ఇటు తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. 13 నుంచి 26వ గేటు వరకు ఏపీ పోలీసులు ముళ్లకంచె ఏర్పాటు చేశారు. ఏపీ తీరుపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు డ్యామ్ వద్దకు చేరుకుని పరిస్థితిని అంచనా వేయనున్నారు. డ్యామ్ కుడి కాలువ నుంచి ఏపీకి నీటి విడుదల కొనసాగుతోంది. ఇప్పటికే సుమారు 4వేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసుకుంది. సాగర్ లో ప్రస్తుతం 522 అడుగుల నీటిమట్టం ఉండగా.. మరో 12 అడుగులు తగ్గితే డెడ్ స్టోరేజ్ కు చేరే అవకాశముంది.
నాగార్జున సాగర్ పై ఎందుకీ వివాదం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కృష్ణా,గోదావరి నదీ బోర్డులు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్ ను తెలంగాణ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ నిర్ణయం సరిగ్గా అమలు కాలేదు. శ్రీశైలం జలాశయంలో ఎడమ విద్యుత్ కేంద్రాన్ని రాష్ట్రమే నిర్వహించుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ అధికారులను ఇటు రానివ్వడం లేదు. నాగార్జునసాగర్ డ్యామ్ విషయానికొస్తే.. 26 గేట్లలో 13 గేట్లు ఏపీ పరిధిలో ఉన్నాయి.
ఏపీకి కూడా తెలంగాణ అధికారులే కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణాబోర్డు నీటి విడుదలకు ఆదేశాలిచ్చినా.. తెలంగాణ అధికారులు నీటిని విడుదల చేయని సందర్భాలుండేవి. నీటి విడుదలపై ఏపీ.. తెలంగాణ అధికారులకు ఎలాంటి ఇండెంటు పంపలేదు. 2 నెలల్లో నీటి విడుదలకు ఎలాంటి ఇబ్బందులూ రాలేదు. కానీ.. జలాశయాలను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని ఏపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న తరుణంలో.. తెలంగాణ పోలింగ్ రోజున సాగర్ వద్ద భారీగా పోలీసులు మోహరించి.. తమ నీటి హక్కుల గురించి మాట్లాడటం ఇరు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.
.
.