Nagarjuna Sagar Dam : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వివాదం మరింత ముదిరింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటాపోటీగా కేసులు పెట్టుకున్నాయి. తమపై దాడి చేసి నాగార్జునసాగర్ డ్యామ్పైకి అక్రమంగా చొరబడ్డారని ఏపీ పోలీసులపై అక్కడ భద్రతగా ఉన్న తెలంగాణ పోలీస్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. అలాగే అనుమతి లేకుండా నాగార్జున సాగర్ నీటిని విడుదల చేశారని ఏపీ ఇరిగేషన్ అధికారులపై కూడా తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి.
మరోవైపు తాజాగా తెలంగాణ పోలీసులపై కూడా ఏపీ నీటిపారుదల అధికారులు ఫిర్యాదు చేశారు. నాగార్జునసాగర్ డ్యామ్పై తమ విధులను అడ్డుకున్నారని ఆరోపించారు. దీనిపై విజయపురి దక్షిణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏపీ నీటిపారుదలశాఖ అధికారుల ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులపై విజయపురి స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి. కృష్ణా జలాల పంపకాల్లో రెండు రాష్ట్రాల మధ్య మరోసారి వివాదం ఏర్పడింది. ఇప్పుడు ఇరు రాష్ట్రాల అధికారులు పోటాపోటీగా కేసులు పెట్టుకోవడంతో ఈ వివాదం మరింత హీటెక్కింది.