Nagarjuna Akkineni: మాధాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై దాని యజమాని, సినిమా హీరో నాగార్జున మరోసారి స్పందించారు. ఎన్ కన్వెన్షన్ను పట్టా భూమిపైనే నిర్మించామని, ఒక్క అంగుళం కూడా తాము ఆక్రమించలేదని పునరుద్ఘాటించారు. కోర్టు తీర్పుకు తాను కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.
‘ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులకు.. ఎన్ కన్వెన్షన్కు సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలే ఎక్కువగా ఉన్నాయి. కన్వెన్షన్ నిర్మించిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించలేదు. తిమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ (ప్రొహిబిషన్) యాక్ట్ కింద 2014 ఫిబ్రవరి 24వ తేదీన ఒక ఆర్డర్ ఇచ్చింది. ఈ నిర్మాణం చట్టబద్ధత గురించి హైకోర్టును ఆశ్రయించాను. న్యాయస్థానం తీర్పు కోసం వేచి చూస్తున్నాను. కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు ఊహాగానాలు, అవాస్తవాలు, ఎలాంటి పుకార్లనూ నమ్మవద్దని మిమ్మల్ని సవినయంగా అభ్యర్థిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.
మాధాపూర్లోని ఎన్ కన్వెన్షన్ను హైడ్రా అధికారులు నిన్న ఉదయం సుమారు నాలుగు గంటలపాటు కూల్చేశారు. తిమ్మిడికుంట పక్కనే ఉన్న ఈ కన్వెన్షన్ నిన్న మధ్యాహ్నానికల్లా నేలమట్టమైంది. తిమ్మిడికుంట బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోని 3 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించి ఈ నిర్మాణం చేపట్టారనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలోనే గతంలో జీహెచ్ఎంసీ నోటీసులు పంపింది. తాజాగా, ఇందుకు సంబంధించిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాసి పేర్కొన్నారు. ఆ తర్వాత హైడ్రా రంగంలోకి దిగింది. గతంలో జీహెచ్ఎంసీ పంపిన నోటీసుల ఆధారంగా ఎన్ కన్వెన్షన్ను కూల్చివేసింది.
Also Read: Bigotry: దెయ్యం వదిలిస్తానని కొట్టి చంపిన పాస్టర్
ఇదిలా ఉండగా, తాము ఎలాంటి కబ్జాకు పాల్పడలేదని, ఎన్ కన్వెన్షన్ పక్కా పట్టాభూమిలో ఉన్నదని నాగార్జున్ నిన్న ట్వీట్ చేశారు. అధికారులు చట్టానికి వ్యతిరేకంగా ఇలా ఎన్ కన్వెన్షన్ కూల్చేయడం బాధాకరం అని వాపోయారు. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు.