Mynampally: ఎమ్మెల్యే మైనంపల్లి తగ్గేదేలే అంటున్నారు. ఓ బీఆర్ఎస్ బిగ్ లీడర్ తనకు ఫోన్ చేశారని చెప్పారు. తొందరపడొద్దని.. కాస్త ఆలోచించుకోమని.. ప్రజాభిప్రాయం తీసుకోవాలని కోరారని అన్నారు. ఆయన సూచన మేరకు వారం పాటు మల్కజ్గిరి నియోజకవర్గంలో తిరుగుతానని.. ప్రజలతో మాట్లాడాక.. ఆ తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు మైనంపల్లి.
మైనంపల్లి వ్యాఖ్యలు బీఆర్ఎస్లో కాక రేపుతున్నాయి. ఆయన పార్టీలో ఉంటారా? ఉండరా? అనే టెన్షన్ పెరిగింది. మైనంపల్లినే వెళ్లిపోతారా? ఆయన్నే బయటకు పంపిస్తారా? అనే చర్చ నడుస్తోంది.
తాజాగా, తన అనుచరులతో భేటీ తర్వాత కూడా ఎమ్మెల్యే హన్మంతరావు అసలేమాత్రం తగ్గలేదు. వెన్నుపోటు పొడిచే అలవాటు తనకు లేదన్నారు. తానెప్పుడూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లను తిట్టలేదంటూ మరింత ట్విస్ట్ ఇచ్చారు. అన్నిపార్టీల్లోనూ కర్చీఫ్ వేసుకుంటున్నారు.
25 ఏళ్ల కొడుక్కు మెదక్ సీటు కోసమే మైనంపల్లి ఆరాటం, పోరాటమంతా. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇస్తానంటే ఆ పార్టీలోకి వెళ్లాలని చూస్తున్నారు. కానీ, హస్తం పార్టీ సైతం రెండు సీట్ల ఇస్తామంటూ హామీ ఇవ్వట్లేదని తెలుస్తోంది. అందుకే, మరికొన్ని రోజులు ఆగాలని చూస్తున్నారట. అప్పటికీ కాంగ్రెస్ నుంచి ఆఫర్ రాకపోతే.. బీజేపీలోనైనా చేరి.. రెండు సీట్లు సంపాదించాలనేది మైనంపల్లి ఆలోచన. అందుకే, గులాబీ పార్టీపైనే వాయిస్ పెంచారు. కేసీఆర్కూ బెదిరేది లేదంటున్నారు. మరి, మైనంపల్లి కారు దిగేదాకా ఆగుతారా? ఆలోగానే వేటు వేస్తారా? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.