Murder in narayanapeta: నారాయణపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా కొట్టి హతమార్చారు. ఈ ఘటన ఊట్కూర్ మండలంలోని చిన్నపొర్లలో జరిగింది. గాయపడిన అదే గ్రామానికి చెందిన సంజీవ్ను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దాయాదుల దాడి..
పొలం విషయంలో జరిగిన గొడవకు దాయాదులు దాడి చేసి చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న సంజీవ్.. ఇటీవల గ్రామానికి వెళ్లి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ తరుణంలో తన నాలుగు ఎకరాలు భూమి విషయంలో దాయాదుల మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవ చివరికి ఘర్షణకు దారి తీయడంతో కర్రలతో సంజీవ్పై దాయాదులు ఒక్కసారిగా దాడి చేశారు.
అందరూ చూస్తుండగానే..
చిన్నపొర్లకు చెందిన లక్ష్మప్పకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య బాలమ్మ కుమారుడు సంజప్ప..రెండో భార్య తిమ్మమ్మ కుమారులు పెద్ద సౌరప్ప, చిన్న సౌరప్ప. అయితే లక్ష్మప్పకు ఉన్న 9 ఎకరాలను ముగ్గురు సమానంగా పంచుకున్నారు. ఈ పంపకాల్లో అన్యాయం జరిగిందని సంజప్ప అభ్యంతరం వ్యక్తం చేశాడు. తర్వాత పొలం దున్నేందుకు చిన్న సౌరప్ప, పెద్ద సౌరప్ప వెళ్లగా.. విషయం తెలుసుకున్న సంజప్ప అక్కడికి వెళ్లి అడగగా గొడవ జరిగింది. అందరూ చూస్తుండగానే సంజప్పపై కర్రలతో దాడి చేశారు.
అంబులెన్స్ అడ్డుకున్న బంధువులు..
మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అంబులెన్స్లో స్వగ్రామానికి తీసుకొస్తుండగా..అంబులెన్స్ ను మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. ఊట్కూర్ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇరు వర్గాల మధ్య దాడి జరుగుతుండగా.. ఎస్ఐ, డయల్ 100కు ఫోన్ చేసినా స్పందించలేదని ఆరోపించారు. పోలీసులు ప్రజల రక్షణ కోసం ఉన్నారా.. ప్రాణాలు తీసేందుకు ఉన్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి 8 గంటలు గడిచినా అంబులెన్స్ ముందు బైఠాయించారు.
ఎస్ఐ సస్పెండ్
ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో.. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఊట్కూర్ ఎస్ఐ బిజ్జ శ్రీనివాసులను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ మల్టీ జోన్ 2 ఐజీ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే దాడి ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులపై కేసు నమోదు కాగా..ఇప్పటివరకు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఏ4 చిన్న సంజప్ప, ఏ5 గుడి ఆశప్ప, ఏ6 గువ్వల శ్రీను, ఏ7 గువ్వల కిష్టప్పలను అరెస్ట్ చేశామని.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని ఐజీ పేర్కొన్నారు.