Mulugu Forest Lakh Of Trees Collapsed In Mulugu: వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు ములుగు జిల్లాను భయపెడుతున్నాయి. మొన్న తాడ్వాయి అడవుల్లో సుడిగాలి సృష్టించిన విధ్వంసం ఇంకా మరువలేకపోతున్నారు. ఎందుకంటే 500 ఎకరాల అడవిలో దాదాపుగా లక్ష భారీ వృక్షాలు నేలమట్టం అయ్యాయి. అంతకుముందు 2019లో కారు మబ్బులు కమ్మేయడంతో కుంభవృష్టి తప్పదని స్థానికులు భయపడ్డారు.అప్పుడు ప్రమాదం తప్పింది. కానీ మొన్న అడవిలో బీభత్సం సృష్టించింది అని అనుకుంటున్నారు స్థానికులు. ఇంతకీ ములుగు జిల్లాలో ఎందుకీ మార్పులు? ఏదైనా ప్రమాదానికి, పెను విపత్తుకు ఇది సంకేతమా?
అది ఆగస్టు 31, హైదరాబాద్కు దాదాపుగా 240 కిలోమీటర్ల దూరంలోని తాడ్వాయి రిజర్వ్ ఫారెస్ట్. సాయంత్రం ఐదారు గంటలు అవుతోంది. జస్ట్ కొద్ది నిమిషాల్లోనే అడవిలోని భారీ వృక్షాలు నేలకొరిగాయి. తాడ్వాయి నుండి మేడారం వెళ్లే అటవీ ప్రాంతంలో సుమారు 2 కిలో మీటర్ల వెడల్పు, 14 కిలోమీటర్ల మేర అడవిలోని వటవృక్షాలు నేలమట్టమయ్యాయి. యావరేజ్గా లక్ష చెట్లు విరిగిపడ్డాయన్నది ప్రభుత్వ లెక్క. భూమిలోకి పాతుకుపోయిన పెద్దపెద్ద చెట్లు అన్నీ కూడా వేర్లతో సహా బయటకు వచ్చాయి. కొన్ని చెట్ల కాండాలు నిట్ట నిలువునా చీలిపోయి, వడితిరిగి పడ్డాయి. మొత్తంగా అక్కడ జరిగింది ఎన్నడూ చూడని విధ్వంసం. ఇది మానవమాత్రుల పనికాదు. మరి ఏం జరిగింది.
ఈసారి అదే రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. కాకపోతే 2019 సంవత్సరం. జులై 9,10 తేదీల్లో ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపూర్ ప్రాంతాల్లోనే క్లౌడ్ బరస్ట్ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆకాశంలో ఉండాల్సిన మేఘాలు గ్రామాల్లోని ఇండ్లను తాకేలా కిందకు వచ్చాయి. టోర్నడో ఏర్పడుతుందా అనేలా కారుమేఘాలు కమ్మేశాయి. పంట పొలాల్లో పనికి వెళ్లిన కూలీలు, గ్రామాల్లోని ప్రజలు అంత దగ్గరగా మేఘాలను చూసి, భయాందోళనకు గురయ్యారు. కొన్ని గంటల పాటు భీకరమైన మేఘాలు భూమికి దగ్గరగా ప్రయాణించాయి. కొన్ని చోట్ల తెల్లని మబ్బులు, మరికొన్ని చోట్ల నల్లని మేఘాలు భూమిని తాకినంత పనిచేశాయి.
Also Read: హైదరాబాద్.. భూమిలో నుంచి పొగలు.. ప్రజలు షాక్..
అయితే కొన్ని గంటల తరువాత ఈ మేఘాలు ఆకాశం వైపు పయనించడంతో ఆ ప్రాంత వాసులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనపై అప్పుడే అధికారులు స్టడీ చేసి ఉంటే ములుగు జిల్లా పరిధిలోని ప్రకృతిలో వస్తున్న భారీ మార్పుల గురించి కొంత సమాచారం తెలిసి ఉండేది. “అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ ఓ డైలాగ్ చెబుతారు. నల్లమబ్బు ఆకాశాన్ని కమ్మినట్టు నల్లగుడిని కమ్మేస్తా అంటారు”. సేమ్ సీన్ తాడ్వాయి అడవుల్లో ఏర్పడింది. ఆ నల్లమబ్బును చూస్తే ఎంతటి గుండెధైర్యం ఉన్నోడికైనా వణుకుపుట్టడం ఖాయం. అలాంటి మబ్బులు తాడ్వాయి ఫారెస్ట్ రేంజ్ లోనే ఎందుకు ఏర్పడ్డాయి అనేది ఇక్కడ క్వశ్చన్. ఇది 2019లోని విజువల్స్ అయినప్పటికీ సేమ్ ఇలాంటి సీనే ఆగస్టు 31 రోజు కూడా ఏర్పడి ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జలశయాలు, నది ప్రవాహాలు ఉండే ప్రాతంలో కనిపించే వాటర్ స్పౌట్స్ తాడ్వాయి సమీపంలో ఏర్పడ్డాయని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మేఘాలు అత్యంత కిందకు రావడం.. అదే సమయంలో అతివేగంతో గాలులు రావడంతో టోర్నడో ఏర్పడి ఉంటుందంటున్నారు. అంతలా ప్రకృతిలో మార్పులు రావడానికి కారణాలేంటో పక్కాగా చెప్పలేకపోతున్నారు. ఐఎండీ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లు ఘటన జరిగిన సమయంలో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులను అధ్యయనం చేస్తున్నాయి. నిజాలు, నివేదికలు ఎలా ఉన్నా….ఇంతటి విద్వంసం జనావాసాల్లో జరిగితే ఎలా అనే భయం వెంటాడుతోంది. అయితే ఇంతటి విపత్తు ములుగు జిల్లాలో ఎందుకు జరిగింది అనే విషయం అధికారులు తేల్చాల్సి ఉంది.
తాడ్వాయి అడవి ధ్వంసం, ఏటురునాగారంలో ఏర్పడిన పరిస్థితులను గమనిస్తే ములుగు జిల్లా ప్రాంతం ప్రకృతి వైపరీత్యాలకు నిలయంగా ఉందనే చర్చ జరుగుతోంది. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే అటవీ సంపద ఉన్న ములుగు ప్రాంతంలోనే ఇలాంటి విపరీత మార్పులు ఎందుకు వస్తున్నాయనేది శాస్త్రవేత్తలు తేల్చాల్సి ఉంది. ఏది ఏమైనా అసలు మూలాలు తెలిసే వరకూ ములుగు జిల్లా డేంజర్ జోన్ లో ఉన్నట్లే.